కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయితగా పౌలును గుర్తిస్తున్నారు. (1 కొరింతి 1:1; 16:21). పౌలు ఎఫేసులో ఉన్నప్పుడో, అంతకు ముందు కాలం లోనో ఈ పత్రిక కన్నా ముందటి పత్రిక మరొకటి అతడి కొరింతి సంఘానికి రాశాడు (5:10-11). కొరింతి సంఘం దాన్ని అపార్థం చేసుకున్నది. దురదృష్టవశాత్తూ ఆ పత్రిక ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఈ ముందటి పత్రికలోని అంశాలు ఏమీ తెలియవు. డానికి స్పందనగా కొరింతి సంఘం వారు రాసి పంపిన పత్రికకు జవాబుగా పౌలు 1 కొరింతి పత్రిక రాశాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 55 - 57
ఈ పత్రికను పౌలు ఎఫెసు నుండి రాశాడు.
స్వీకర్త
1 కొరింతి పత్రికను అందుకున్న వారు కొరింతులో ఉన్న దేవుని సంఘం (1 కొరింతి 1:2). అయితే పౌలు తాను ఈ పత్రిక “ప్రతి చోటా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించే వారందరి” కోసం అని కూడా పేర్కొన్నాడు.
ప్రయోజనం
కొరింతి సంఘంలో నెలకొన్న స్థితిగతుల గురించి అనేకమంది ద్వారా పౌలుకు తెలిసింది. సంఘంలోని బలహీనతల విషయంలో దిద్దుబాటు, ఉపదేశం ఇచ్చి దానికి పూర్వ క్షేమ స్థితి కలిగించడం పౌలు ఈ పత్రిక రాయడంలో ముఖ్య ఉద్దేశం. చీలికలు (1:10-4:21), పునరుత్థానం గురించిన భిన్న బోధలు (అధ్యా. 15), దుర్నీతి (5, 6:12-20), ప్రభువు బల్ల విషయంలో దురాచారాలు (11:17-34) మొదలైన వాటిని సరిదిద్దడం ఈ పత్రిక ఉద్దేశం. కొరింతి సంఘంలో అనేక వర ప్రసాదాలు ఉన్నాయి (1:4-7). కానీ సంఘం పరిణతి చెందలేదు. ఆధ్యాత్మికంగా లేదు (3:1-4). సంఘం తనలోని అన్ని రకాల పాపాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే డానికి ప్రాముఖ్యమైన సూచనలు పౌలు ఇస్తున్నాడు. అందులోని సంబంధ బాంధవ్యాల సమస్యలను, దురాచారాలను చూసీ చూడనట్టు పోనియ్యక నేరుగా సూటిగా పౌలు వాటిని ఎత్తి చూపుతున్నాడు.
ముఖ్యాంశం
విశ్వాసి ప్రవర్తన
విభాగాలు
1. పరిచయం (1:1-9) — 1:1-9
2. కొరింతి సంఘంలో విభేదాలు — 1:10-4:21
3. నైతిక అల్లకల్లోలం — 5:1-6:20
4. వివాహ సూత్రాలు — 7:1-40
5. అపొస్తలుల స్వేచ్ఛ — 8:1-11:1
6. ఆరాధన సూచనలు — 11:2-34
7. ఆధ్యాత్మిక బహుమతులు — 12:1-14:40
8. పునరుత్థాన సిద్ధాంతం — 15:1-16:24
1
కృపలో విశ్వాసి స్థానం
దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు, కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.
క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
క్రీస్తులో కొరింతి విశ్వాసుల స్థానంతో పోల్చుకుంటే వారి పతనమైన ఆధ్యాత్మిక స్థితి
10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.
(1) వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు
11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.
(2) మానవపరమైన జ్ఞానంలో అతిశయిస్తున్నారు
18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. 19 దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది. 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23 అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24 అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.
(3) ఏది ఏమైనా వారు అంత జ్ఞానులు కారు
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.