పేతురు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
మొదటి వచనంలోనే ఈ పత్రిక రచయిత “యేసు క్రీస్తు అపోస్తలుడు పేతురు” అని సూచిస్తున్నది. ఇతడు తనను అపోస్తలుడుగా చెప్పుకున్నాడు (1:1). క్రీస్తు పడిన హింసల గురించి ఇతడు పదేపదే ప్రస్తావించడాన్ని బట్టి (2:21-24; 3:18; 4:1; 5:1) హింసల పాలైన సేవకుడు అనే అభిప్రాయం అతని మనస్సులో గాఢమైన ముద్ర వేసిందని అర్థం అవుతున్నది. ఇతడు మార్కును “కుమారుడు” గా చెబుతున్నాడు (5:13). అపో. కా. గ్రంథంలో (2:2) లో చెప్పిన కుటుంబంతోనూ, ఈ యువకునితోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ వాస్తవాలను బట్టి సహజంగానే అపోస్తలుడు పేతురు ఈ పత్రిక రాశాడని భావించవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 62 - 64
5:13 లో రచయిత బబులోను సంఘం నుండి అభినందనలు పంపుతున్నాడు.
స్వీకర్త
ఆసియా మైనర్ ఉత్తర ప్రాంతాల్లో చెదరి ఉన్న క్రైస్తవ సమూహాలను పేతురు ప్రస్తావించాడు. బహుశ, యూదులు, యూదేతరులు కలిసి ఉన్న ప్రజానీకానికి పేతురు రాశాడు.
ప్రయోజనం
ఈ పత్రిక తాను ఎందుకు రాసాడో పేతురు వివరించాడు. అదేమిటంటే విశ్వాసంలో బాధలు ఎదుర్కొంటున్న వారిని ప్రోత్సహించడం. దేవుని కృప లభ్యమయ్యేది క్రైస్తవ్యంలో మాత్రమే అని వారికి హామీ ఇస్తున్నాడు. అందుచేత వారు విశ్వాసం విడనాడ కూడదు. 5:12 లో చెప్పినట్టు “ఇదియే సత్యమైన దేవుని కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి నిలకడగా ఉండుడి.” తన పత్రిక చదివే వారి మధ్య ఈ హింస విస్తారంగా ఉన్నట్టు ఉంది. పేతురు మొదటి పత్రిక ఉత్తర ఆసియా మైనర్ అంతటా క్రైస్తవులకు ఉన్న హింసను స్మరిస్తున్నది.
ముఖ్యాంశం
హింసకు ప్రతి స్పందన.
విభాగాలు
1. అభివాదం — 1:1, 2
2. దేవుని కృపను బట్టి ఆయనకు స్తుతి — 1:3-12
3. పవిత్ర జీవనానికి ప్రోత్సాహం — 1:13-5:12
4. అంతిమ శుభాకాంక్షలు — 5:13, 14
1
క్రైస్తవులకు వాటిల్లే హింసలు, వారి ప్రవర్తన
యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక.
మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.
నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.
10 మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11 వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12 తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.
13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.
15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.
17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.
18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.
19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.
24 “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు.
వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.
గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది
25 గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”
ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.