తిమోతికి రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయిత పౌలు. తిమోతి పత్రికల్లో వీటిని రాసింది అపోస్తలుడు పౌలు అని స్పష్టంగా కనిపిస్తుంది. “దేవుని చిత్తము చొప్పున క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు” (1:1). అది సంఘం ఈ ఉత్తరం పౌలు రచన అని స్పష్టంగా అంగీకరించింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 62 - 66
పౌలు తిమోతి ని ఎఫేసులో ఉంచి, మాసిడోనియాకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఈ లేఖ రాశాడు (1:3; 3:14, 15).
స్వీకర్త
ఈ పత్రికను తిమోతికి రాశాడు గనక ఈ పేరు స్థిరపడింది. తిమోతి పౌలుతో కలిసి ప్రయాణాలు చేశాడు. అతని సువార్త యాత్రల్లో అతని సహాయకుడుగా ఉన్నాడు. తిమోతి, సంఘం కూడా ఈ పత్రిక గ్రహీతలు.
ప్రయోజనం
దేవుని ఇల్లు ఎలాటి క్రమంలో నడవాలో తిమోతికి వివరించడం పత్రిక లక్ష్యం (3:14-15). తిమోతి ఈ సూచనలను నిష్ఠగా పాటించాలని అతనికి హెచ్చరిక. ఈ వచనాలు ఈ పత్రిక విషయంలో పౌలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి, “సజీవుడైన దేవుని సంఘంలో అయిన సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో తెలిపేటందుకు” ఈ పత్రిక పౌలు రాశాడు. ఎందుకంటే ఆ సంఘం సత్యానికి స్థంభం, పునాది. సంఘాలను కట్టడం, అభివృద్ధి పరచడం ఎలానో పౌలు తన సహచరులకు సూచనలివ్వడం ఇక్కడ కనిపిస్తుంది.
ముఖ్యాంశం
యువ శిష్యునికి సూచనలు
విభాగాలు
1. పరిచర్య పధ్ధతులు — 1:1-20
2. పరిచర్య సూత్రాలు — 2:1-3:16
3. పరిచర్యలో బాధ్యతలు — 4:1-6:21
1
ధర్మ శాస్త్రపరమైన, పనికిమాలిన బోధ ఖండన
విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.
కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు. అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.
11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు. 12 నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.
16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.
18 తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు. 19 అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు. 20 వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.