ప్రసంగి
గ్రంథకర్త
ఈ పుస్తకంలో నేరుగా రచయిత పేరు కనిపించదు. 1:1 లో రచయిత తనను “కొహెలెల్’’ (ఉపదేశకుడు) అనే పేరులో పరిచయం చేసుకున్నాడు. ముందుకుపోయి తనను “దావీదు కుమారుడు, యెరూషలేము రాజు’’ అని చెప్పుకున్నాడు. “యెరూషలేములో నాకు ముందున్న వారందరిలోకి అధిక జ్ఞానం సంపాదించిన వాడిని’’ అని తన గురించి వివరించాడు. తాను అనేక సామెతలు సేకరించినట్టు చెప్పుకున్నాడు (1:1, 16; 12:19). యెరుషలేము నగరంలో ఇశ్రాయేలు రాజ్యం అంతటిపైనా పరిపాలించిన దావీదు కుమారుడు సొలోమోను ఒక్కడే (1:12). ఈ గ్రంథ కర్త సొలోమోను అని సూచించే వచనాలు ఇందులో చాలా ఉన్నాయి. సొలొమోను మరణం తరువాత వేరొక వ్యక్తి రాసి ఉంటాడు, అనిపించే సందర్భానుసారమైన ఆధారాలు కొన్ని ఉన్నాయి.
రచనా కాలం, ప్రదేశం
సుమారు 970 - 930
ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను పాలన అంతంలో రాసి ఉండవచ్చు. యెరుషలేములో ఈ గ్రంథం రాసినట్లు ఉంది.
స్వీకర్త
ప్రాచీన ఇశ్రాయేలీయులు, బైబిలు పాఠకులందరూ.
ప్రయోజనం
ఈ గ్రంథంలో మనకొక గొప్ప హెచ్చరిక ఉంది. ఒక గురి, దైవభక్తి లేని జీవితం వ్యర్థం; అనవసరంగా గాలిని పట్టుకోడానికి ప్రయత్నించిన దానిలో సమానం. మనం సుఖభోగాలను, సిరిసంపదలను, సృజనాత్మక కార్యకలాపాలను, జ్ఞానాన్ని, లేక విషయ వాంఛలను కోరి వాటి వెంటబడితే జీవితాంతంలో మన జీవితమంతా వ్యర్థం చేసుకున్నామని అర్ధమవుతుంది. దేవుడే గురిగా కలిగిన జీవితం ద్వారానే దానికి ఒక అర్ధమంటూ వస్తుంది.
ముఖ్యాంశం
దేవుడు తప్ప మిగతాదంతా వ్యర్థమే
విభాగాలు
1. పరిచయం — 1:1-11
2. జీవితంలో అనేక అంశాలు వ్యర్థం — 1:12-5:7
3. దేవుని భయం — 5:8-12:8
4. చివరి తీర్మానం — 12:9-14
1
మానవ జ్ఞనం వ్యర్థం
యెరూషలేమును పరిపాలించే రాజు, దావీదు కొడుకూ అయిన ప్రసంగి మాటలు. పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.
సూర్యుని కింద* 1:3 సూర్యుని కింద భూమి పైన మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తూ ఉంది. భూమి మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మళ్ళీ ఉదయించాల్సిన స్థలం చేరడానికి త్వరపడతాడు.
గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలా తన దారిలో మళ్ళీ మళ్ళీ వీస్తూ తిరిగి వస్తున్నది. నదులన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయి గానీ అది ఎప్పటికీ నిండడం లేదు. నదుల నీరంతా అవి ఎక్కడనుండి పారుతూ వస్తున్నాయో అక్కడికే వెళ్లి తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాయి.
మధ్యలో విశ్రాంతి లేకుండా అన్నీ అలసటతోనే జరిగిపోతున్నాయి. మానవులు దాన్ని వివరించలేరు. చూసే వాటి విషయంలో కంటికి తృప్తి కలగడం లేదు. వినే వాటి విషయంలో చెవికి తృప్తి కలగడం లేదు. ఇంతవరకూ ఉన్నదే ముందు కూడా ఉంటుంది. ఇంతవరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఇది కొత్తది అని చెప్పదగినది సూర్యుని కింద ఏదీ లేదు. 10 ఇది కొత్తది అని దేని గురించైనా ఎవరైనా చెప్పినా అది కూడా చాలా కాలం నుండీ ఉన్నదే. 11 మన పూర్వికులు మన జ్ఞాపకంలో ఉండరు, ఇప్పుడు ఉన్నవారి జ్ఞాపకం తరవాత వచ్చే వారికి కలగదు.
12 బోధకుణ్ణి అయిన నేను యెరూషలేములో ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాను. 13 ఆకాశం కింద జరుగుతున్న దాన్ని తెలివిగా వెతికి గ్రహించడంపై నా మనస్సు నిలిపాను. మానవులు నేర్చుకోవడం కోసం దేవుడు వారికి ఏర్పాటు చేసిన పని చాలా కష్టంతో నిండి ఉంది.
14 సూర్యుని కింద జరుగుతున్న వాటన్నిటినీ నేను చూశాను. ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాస పడినట్టు అవన్నీ ప్రయోజనం లేనివే. 15 వంకరగా ఉన్నది చక్కబడదు. కనిపించనిది లెక్కలోకి రాదు. 16 “యెరూషలేములో నాకంటే ముందున్న వారందరి కంటే నేను అధిక జ్ఞానం సంపాదించాను, సంపూర్ణమైన జ్ఞానాన్నీ విద్యనీ నేను నేర్చుకున్నాను” అని నా మనస్సులో అనుకున్నాను. 17 కాబట్టి జ్ఞానం, వెర్రితనం, బుద్ధిహీనత, వీటిని గ్రహించడానికి కష్టపడ్డాను. కానీ ఇది కూడా ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
18 విస్తారమైన జ్ఞానార్జనలో విస్తారమైన దుఃఖం ఉంది. ఎక్కువ తెలివి సంపాదించిన వారికి ఎక్కువ బాధ కలుగుతుంది.

*1:3 1:3 సూర్యుని కింద భూమి పైన