హగ్గయి
గ్రంథకర్త
హగ్గయి 1:1 ఈ పుస్తక రచయిత హగ్గయి ప్రవక్తగా గుర్తిస్తున్నది. యెరుషలేములోని యూదుల కోసం హగ్గయి నాలుగు సందేశాలను గ్రంథస్థం చేశాడు. హగ్గయి 2:3 ప్రవక్త యెరుషలేము వినాశనానికీ, ప్రవాసానికీ ముందు యెరుషలేమును చూశాడని సూచిస్తున్నది. అంటే అతడు వృద్ధుడు, తన జాతికి పూర్వ వైభవం మళ్ళీ సమకూడాలని చూస్తున్నాడు. చెర తాలూకు హీనస్ధితినుండి తన ప్రజలు కోలుకొని జాతుల మధ్య దేవుని వెలుగుగా తమ అసలైన స్థానాన్ని పొందాలి అని అతని ఆకాంక్ష.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 520
ఇది చెర అనంతర గ్రంథం. అంటే బబులోను చెర తరువాత రాసినది.
స్వీకర్త
తిరిగి వచ్చిన ప్రజలు తమ దేశానికి తిరిగి వచ్చిన తృప్తితో అలా నిర్లిప్తంగా ఉండిపోకుండా ఆలయం నిర్మించడానికి తగిన విశ్వాసం కనపరచాలి. ఆలయ నిర్మాణం, ఆరాధన ప్రారంభం తిరిగి మొదలు పెట్టాలి. ఆలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే యోహోవా వారిని ఆశీర్వదిస్తాడని వారిని ప్రోత్సాహించడానికి, వచ్చిన శేషప్రజ యోహోవా తమ గత కాలపు తిరుగుబాటును విస్మరించి భావికాలంలో ఆయన వారికి ప్రముఖ స్దానం ఇస్తాడని ప్రోత్సాహించడానికి ఈ పుస్తకం.
ముఖ్యాంశం
ఆలయం పునర్నిర్మాణం
విభాగాలు
1. ఆలయ నిర్మాణానికై పిలుపు. — 1:1-15
2. యెహోవాలో ధైర్యం — 2:1-9
3. జీవనంలో పవిత్రత — 2:10-19
4. భావికాలానికై నిబ్బరం — 2:20-23
1
యెహోవా మందిరాన్ని కట్టడానికి పిలుపు
రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.
“మేము కలిసి రావడానికి గానీ యెహోవా మందిరాన్ని కట్టడానికి గానీ ఇది సమయం కాదు అని ఈ ప్రజలు చెబుతున్నారు కదా.”
అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పినదేమిటంటే,
“ఈ మందిరం పాడై ఉండగా మీరు కలపతో కప్పిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?
కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే.
మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు.
మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు.
బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు.
పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.
కాగా సేనల ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.
పర్వతాలెక్కి కలప తీసుకు వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించండి. అప్పుడు నేను ఆనందిస్తాను. నాకు ఘనత వస్తుంది” అని యెహోవా అంటున్నాడు.
“విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు గానీ నేను దాన్ని చెదరగొట్టినందువల్ల మీరు కొంచెమే ఇంటికి తెచ్చుకోగలిగారు.
ఎందుకని? యెహోవా అడుగుతున్నాడు.
ఎందుకంటే నా మందిరం పాడై ఉన్నా మీరంతా మీ చక్కని సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
10 అందుకే మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవడం లేదు.
భూమి పండడం లేదు.
11 నేను భూమికీ పర్వతాలకూ అనావృష్టి కలగజేసి,
ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో,
భూమి ఫలించే అన్నిటి విషయంలో,
మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”
12 షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యెహోజాదాకు కొడుకు, ప్రధానయాజకుడు యెహోషువ, శేషించిన ఇశ్రాయేలీ ప్రజలంతా తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త హగ్గయిని పంపించి, తెలియజేసిన మాట విని యెహోవా పట్ల భయభక్తులు చూపారు.
13 అప్పుడు యెహోవా ప్రవక్త హగ్గయి యెహోవా చెప్పగా ప్రజలతో ఇలా చెప్పాడు.
“నేను మీకు తోడుగా ఉన్నాను.” ఇదే యెహోవా వాక్కు.
14 యెహోవా యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు మనస్సును,
ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువ మనస్సును,
శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడు.
15 వారు కూడి వచ్చి, దర్యావేషు రాజు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ రోజున సేనల ప్రభువైన తమ దేవుని మందిరపు పనిచేయడం మొదలుపెట్టారు.