యోబు
గ్రంథకర్త
యోబు గ్రంథం ఎవరు రాశారో తెలియదు. ఫలానా అని ఎక్కడా చెప్పలేదు. ఇద్దరు, అంతకన్నా ఎక్కువ గ్రంథకర్తలు ఉండవచ్చు. బైబిలు పుస్తకాలన్నిటిలోకీ ఇది అత్యంత ప్రాచీన గ్రంథం అనుకోవచ్చు. యోబు మంచివాడు, భక్తిపరుడు. భరించరాని విషాద సంఘటనలు అతనికి దాపురించాయి. అతనికి అలాటి ఉపద్రవాలు ఎందుకు వచ్చాయో యోబు, అతని స్నేహితులు తర్కించడానికి ప్రయత్నించారు. ఇందులోని ముఖ్య పాత్రలు యోబు, తేమానీయుడు ఎలిఫజు, షుహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు, బూజీయిడు ఎలీహు.
రచనా కాలం, ప్రదేశం
క్రీ. పూ. 2100 - 1800
ఇందులోని చాలా భాగాలు అటు తరువాతి కాలంలో రాసిన సంగతులను తెలియజేస్తున్నాయి. బబులోను చెర కాలంలో లేక చెర అనంతరం ఈ పుస్తకం రాసి ఉండవచ్చు. ఎలీహు మాట్లాడిన అధ్యాయాలు ఇంకా తరువాతి కాలంలో రాసి ఉండవచ్చు.
స్వీకర్త
ప్రాచీన యూదులు, ప్రస్తుత బైబిలు చదువరులు. ఈజిప్టులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జాతి వారిని ఉద్దేశించి ఈ పుస్తకం రాశారని పండితులు అభిప్రాయం. ఈజిప్టు వారి చేతుల్లో బాధలు అనుభవిస్తున్న జాతికి కొంత ఊరట కలిగించాలని మోషే ఉద్దేశించి ఉండవచ్చు.
ప్రయోజనం
యోబు గ్రంథం మనకి ఈ క్రింద విషయాలు అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది. సైతానుకు ఆర్ధిక, శారీరిక నష్టం కలిగించే శక్తి లేదు. సైతాను చేయలేని విషయాలపై దేవునికి అదుపు ఉంది. లోకంలో ఉన్న బాధలన్నిటికి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం మానవ అవగాహనకు మించినది. దుష్టులకు తగిన ప్రతిదండన లభిస్తుంది. మన ఆత్మను పరిక్షించడానికి, ఉపదేశించడానికి, పవిత్రపరచడానికి దృఢపరచడానికి కొన్నిసార్లు దేవుడు బాధలను అనుమతిస్తాడు.
ముఖ్యాంశం
బాధల ద్వారా దీవెనలు.
విభాగాలు
1. పరిచయం, సాతాను దాడి – 1:1-2:13
2. యోబు తన ముగ్గురు మిత్రులతో తన బాధలను చర్చించడం. – 3:1-31:40
3. ఎలీహు దేవుని మంచితనాన్నివర్ణించడం – 32:1-37:24
4. దేవుడు యోబుకు తన సార్వభౌమిక అధికారాన్ని వెల్లడించడం – 38:1-41:34
5. దేవుడు యోబుకు పూర్వక్షేమ స్థితి కలిగించడం – 42:1-17
1
యోబు, అతని నేపధ్యం
ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవునిపట్ల భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు. అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్ళలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు.
సాతానుకు దేవునికి మధ్య సంభాషణ
ఒకరోజున దేవదూతలు* 1:6 దేవదూతలు దేవుని కుమారులు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.
అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10 నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11 అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు. 12 అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.
13 ఒక రోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. 14 అతడు వాళ్ళతో “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు. 15 పనివాళ్ళను కత్తులతో చంపివేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను” అని చెప్పాడు.
16 ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. “దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు. 17 అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
18 అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. 19 అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”
22 జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.

*1:6 1:6 దేవదూతలు దేవుని కుమారులు