యెహోషువా
గ్రంథకర్త
యెహోషువ గ్రంథంలో దాని రచయిత పేరు స్పష్టంగా ప్రస్తావించినట్టు కనిపించదు. అయితే మోషే తదనంతరం ఇశ్రాయేల్ పై నాయకుడుగా అయిన నూను కుమారుడు యెహోషువ ఈ పుస్తకం రాసి ఉండవచ్చు. గ్రంథంలో చివర భాగం యెహోషువ మరణానంతరం వేరొక వ్యక్తి రాసి ఉంటాడు. యెహోషువ చనిపోయాక చాలా భాగాలు ఎడిట్ చేయడం, రాసి ఉండటం జరిగి ఉంటుంది. ఈ గ్రంథంలో మోషే మరణం తరువాత యెహోషువ నాయకత్వంలో వాగ్దానదేశాన్ని స్వాధీనపరుచుకున్న కాలం వివరాలు ఉన్నాయి.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 1400 - 1176
యెహోషువ కనానును స్వాధీనం చేసుకున్న సందర్భంలో అక్కడే గ్రంథరచన జరిగింది.
స్వీకర్త
ఇశ్రాయేల్ ప్రజానీకం, తరువాత కాలంలో బైబిల్ పాఠకులందరి కోసం యెహోషువ గ్రంథ రచన జరిగింది.
ప్రయోజనం
దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేసిన సైనిక దాడుల స్థూలవివరాలను యెహోషువ గ్రంథం అందిస్తున్నది. ఈజిప్టు నిర్గమనం, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాల తరువాత కొత్తగా ఏర్పడిన జాతి ఇప్పుడు వాగ్దానదేశంలో ప్రవేశించటానికి, అక్కడి జాతులను ఓడించి ఆ ప్రదేశాలను ఆక్రమించుకోవటానికి సిద్ధంగా ఉంది. నిబంధన క్రింద ఉన్న ఈ ఎన్నికైన జాతి వాగ్దానదేశంలో ఏవిధంగా స్థిరపడ్డారో యెహోషువ గ్రంథం వర్ణిస్తున్నది. పితరులకు తాను చేసిన నిబంధన పట్ల యెహోవాకు ఉన్న నిబద్ధత, సీనాయి వద్ద మొదట తాను చేసిన ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉండడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. నిబంధన పట్ల అంకిత భావం, ఐక్యత, రానున్న తరాల్లో ఉన్నత నైతిక విలువలు ఆ ప్రజల్లో నెలకొని ఉండేలా ఈ లేఖన భాగం వారికి ప్రేరణగా ఉంటుంది.
ముఖ్యాంశం
ఆక్రమణ
విభాగాలు
1. వాగ్దాన దేశ ప్రవేశం — 1:1-5:12
2. దేశాన్ని స్వాధీనం చేసుకోవడం — 5:13-12:24
3. దేశాన్ని పంచుకోవడం — 13:1-21:45
4. గోత్రాల ఐక్యత, యెహోవా పట్ల స్వామిభక్తి — 22:1-24:33
1
యెహోషువకు యెహోవా ఆదేశాలు
యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత, నూను కుమారుడు, మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. “నా సేవకుడు మోషే చనిపోయాడు. కాబట్టి నీవు లేచి, నీవూ ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ మీకు ఇచ్చాను.
ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు. నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను. నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
10 అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి, 11 ‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’ ”
12 రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు, 13 “యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు. 14 మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా 15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.”
16 దానికి వారు “నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం. 17 మోషే చెప్పిన ప్రతి మాటా మేము విన్నట్టు నీ మాటా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక. 18 నీమీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు” అని యెహోషువతో చెప్పారు.