మలాకీ
గ్రంథకర్త
గ్రంథ కర్త మలాకీగా 1:1 గుర్తిస్తున్నది. హీబ్రూలో ఈ పదం వార్తాహరుడు అనే అర్థమిచ్చే పదం నుండి పుట్టింది. దేవుని ప్రవక్తగా మలాకీ పాత్రను ఇది చూపుతున్నది. దేవుని ప్రజలకు అతడు దైవ సందేశాలు వినిపించాడు. రెండవ రకంగా మలాకీ అంటే మనకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నవాడు. అతని సందేశం ఏమిటంటే భావికాలంలో దేవుడు మరొక ప్రవక్తను పంపుతాడు. యెహోవా దినానికి ముందు మహా ప్రవక్త ఏలీయా తిరిగి వస్తాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 450 - 400
ఇది చెర అనంతర గ్రంధం. అంటే యూదులు బబులోను చెరనుండి తిరిగి వచ్చాక రాసిన పుస్తకం.
స్వీకర్త
యేరుషలేము యూదులకు, మరింత విస్తృతంగా అంతటా దేవుని ప్రజలు.
ప్రయోజనం
దేవుడు తన ప్రజల కోసం చేయవలసినదంతా చేస్తాడు. తాను తీర్పరిగా వారి పనుల నిమిత్తం సంజాయిషీ అడుగుతాడు. ఈ రెండు సంగతులు ప్రవక్త ఆ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. నిబంధన దీవెనలు నెరవేరాలంటే వారు తమ దుష్టత్వం విషయం పశ్చాత్తాపపడాలి. ఇది మలాకీ ద్వారా తన ప్రజలకు దేవుని సందేశం. వారు తిరిగి దేవుని వైపు మళ్ళుకోవాలి. పాత నిబంధన చివరి పుస్తకం ముగింపులో దేవుని న్యాయం గురించి ప్రకటన, రానున్న మెస్సీయ ద్వారా వారికి పూర్వ క్షేమ స్థితిని కలుగుతుందనే ఆశాభావం కనిపిస్తున్నాయి.
ముఖ్యాంశం
ఆచార భక్తి విషయంలో గద్దింపు
విభాగాలు
1. దేవునికి ఘనత కలిగించాలని యాజకులకు ప్రోత్సాహం — 1:1-2:9
2. దేవునికి నమ్మకంగా ఉండాలని యూదాకు ప్రోత్సాహం — 2:10-3:6
3. దేవుని వైపుకు మళ్ళుకోవలసిందని యూదాకు ప్రోత్సాహం — 3:7-4:6
1
ఎదోము పతనం, దేవుని ప్రేమను కనపరచడం
ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవా వాక్కు. యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను. ఏశావును ద్వేషించాను* 1:3 ద్వేషించాను అసహ్యించాను . అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”
“మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం” అని ఎదోమీయులు 1:4 ఎదోమీయులు ఏశావు సంతతి వారు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు. కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు.
యాజకుల దోషం
“కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు. మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?” అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు. 10 “మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
11 తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు. 12 మీరైతే యెహోవా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు. 13 అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవా అడుగుతున్నాడు.
14 నేను ఘనమైన గొప్ప రాజును. అన్య దేశాల ప్రజల్లో నా పేరంటే భయం. యెహోవాకు మొక్కుబడి చెల్లించడానికి మగ జంతువు ఉన్నప్పటికీ జబ్బు పడిన దాన్ని అర్పించే వంచకుడు శాపానికి గురి అవుతాడు.

*1:3 1:3 ద్వేషించాను అసహ్యించాను

1:4 1:4 ఎదోమీయులు ఏశావు సంతతి వారు