మత్తయి రాసిన సువార్త
గ్రంథకర్త
ఈ పుస్తక రచయిత మత్తయి పన్ను వసూలుచేసే ఉద్యోగి. అతడు ఆ పని వదిలి పెట్టి యేసును వెంబడించాడు. (9:9-13). మార్కు, లూకా, తమ గ్రంథాల్లో ఇతన్ని “లేవీ” గా పేర్కొంటారు. మత్తయి అనే పేరుకు అర్థం “యెహోవా బహుమానం.” అది సంఘ పితరులు మత్తయి సువార్తను 12 మంది అపోస్తలుల్లో ఒకడైన మత్తయి రాశాడని అంగీకరించారు. యేసు పరిచర్య సంఘటనలకు మత్తయి ప్రత్యక్ష సాక్షి. మత్తయి సువార్తలోని విషయాలను ఇతర సువార్తలతో పోల్చి చూస్తే క్రీస్తును గురించిన అపోస్తలుల సాక్షం పరస్పరం భిన్నంగా లేదని అర్థమౌతుంది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 65 - 70
మత్తయి సువార్తలో కనిపించే యూదు ధోరణిని బట్టి దీన్ని బహుశా పాలస్తీనాలో గానీ సిరియాలో గానీ రాసి ఉండవచ్చు. కొందరు గ్రంథ రచన అంతియొకయలో జరిగింది అంటారు.
స్వీకర్త
ఈ సువార్తను గ్రీసు భాషలో రాశారు గనక మత్తయి యూదు సమాజంలో గ్రీసు భాష మాట్లాడే వారి వైపు మొగ్గు చూపినట్టు అనిపిస్తున్నది. ఇందులోని అనేక అంశాలు యూదుల కోసం రాసినట్టు రుజువు చేస్తున్నాయి. పాత నిబంధన నెరవేర్పు గురించి మత్తయి పట్టించుకోవడం, యేసు వంశావళిని అబ్రాహాము నుండి ఏకరువు పెట్టడం (1:1-17), యూదుల పరిభాష వాడకం (ఇక్కడ “పరలోక” అని వాడడానికి కారణం యూదులు దేవుడు అనే శబ్దం వాడేందుకు ఇష్టపడేవారు కాదు). యేసును దావీదు కుమారుడు అనడం కూడా ఇందుకే. (1:1; 9:27; 12:33; 15:22; 20:30-31; 21:9, 15; 22:41-45). ఈ కారణాలను బట్టి మత్తయి యూదు సమాజం కోసం ఈ పుస్తకం రాశాడని రుజువౌతున్నది.
ప్రయోజనం
ఈ పుస్తకం రాయడంలో మత్తయి ఉద్దేశం తన యూదు పాఠకులు యేసును మెస్సియగా అంగీకరించాలన్నదే. ఇక్కడ దేవుని రాజ్యాన్ని మానవుల చెంతకు తేవడం అనే దానిపై మత్తయి దృష్టి సారించాడు. యేసు పాతనిబంధన ప్రవచనాలను, ఎదురుతెన్నులను నెరవేర్చే రాజు అనే సంగతిని మత్తయి నొక్కి చెబుతున్నాడు.
ముఖ్యాంశం
యేసు, యూదుల రాజు.
విభాగాలు
1. యేసు జననం — 1:1-2:23
2. యేసు గలిలయ పరిచర్య — 3:1-18:35
3. యేసు యూదయ పరిచర్య — 19:1-20:34
4. యూదయలో చివరి దినాలు — 21:1-27:66
5. అంతిమ సంభవాలు — 28:1-20
1
యేసు క్రీస్తు వంశ వృక్షం
అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి.
అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.
శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.
యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.
సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.
ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.
ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.
10 హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.
12 బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి.
యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.
14 అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.
15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.
16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు.
17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.
యేసు జననం
లూకా 1:26-35; యోహా 1:1-2, 14
18 యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.
22-23 “ ‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.
ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే
‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు”
అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.