సామెతలు
గ్రంథకర్త
సామెతలు ప్రధాన రచయిత సొలొమోను. సొలొమోను పేరు 1:1; 10:1; 25:1 లో కనిపిస్తున్నది. ఇతర రచయితలు జ్ఞానులు అనే వర్గానికి చెందిన వివిధ వ్యక్తులు, అగూరు, లెమూయేలు రాజు. బైబిలు ఇతర గ్రంథాల వలె సామెతలు కూడా దేవుని రక్షణ ప్రణాళికను సూచిస్తున్నది. అయితే కొంత అస్పష్టంగా ఈ గ్రంథం ఇశ్రాయేలీయిలకు సరియైన జీవిత విధానం, దేవుని మార్గం అనుసరించవలసిందని సూచిస్తున్నది. సొలొమోను తన జీవిత కాలమంతా గడిచిన విజ్ఞానాన్ని గ్రంథస్థం చెయ్యమని దేవుడు అతణ్ణి ప్రేరేపించి ఉండవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 971 - 931
సొలొమోను పరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది. ఈ సామెతలు అనేక వేల సంత్సరాల వాటివి. అయితే దైవజ్ఞానం ఏ కాలంలోనైనా ఏ సంసృతిలోనైనా వర్తిస్తుంది.
స్వీకర్త
సామెతలు గ్రంథం అనేక వర్గాల కోసం రాసినది. ఇది పిల్లల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు ఇస్తుంది. జ్ఞానాన్ని అన్వేషించే యువతీయువకులకు ఇది అక్కరకు వస్తుంది. భక్తిగా ఉండగోరే నేటి బైబిలు పాఠకులకు ఇందులో ఆచరణాత్మకమైన సలహాలు ఉన్నాయి.
ప్రయోజనం
సామెతలు గ్రంథంలో సొలొమోను సాధారణ, దైనందిన పరిస్దితుల్లోను, ఉన్నత జ్ఞాన సంబంధిత విషయాల్లోనూ దేవుని మనస్సును వెల్లడించాడు. సోలొమోను రాజు ఏ అంశాన్నీ ఉపేక్షించలేదు. వ్యక్తిగత ప్రవర్తన, లైంగిక సంబధాలు, వ్యాపారం, సంపద, దానధర్మాలు, ఆశయాలు, క్రమశిక్షణ, అప్పులు, పిల్లలను పెంచడం, వ్యకిత్వం, మద్యపానం, రాజకీయాలు, పగ, దైవ భక్తి మొదలైన అనేక అంశాలు ఈ జ్ఞాన వాక్కుల సంకలనంలో చోటు చేసుకున్నాయి.
ముఖ్యాంశం
జ్ఞానం
విభాగాలు
1. జ్ఞానం యొక్క ఉత్తమాంశాలు — 1:1-9:18
2. సోలొమోను సామెతలు (అధ్యా. — 10:1-22:16)
3. జ్ఞానులు ఉవాచలు — 22:17-29:27
4. అగూరు మాటలు — 30:1-33
5. లెమూయేలు వాక్కులు — 31:1-31
1
ఉద్దేశం, నేపథ్యం
దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.
జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.
తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.
వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.
దుర్మార్గులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు
కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.
10 కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
11 దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం.
12 ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.
13 దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి.
14 నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు.
15 కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో.
16 మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
17 ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.
18 వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు.
19 అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది.
జ్ఞానం తిరస్కరించడం వల్ల ఫలితం
20 జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.
21 జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది.
22 “జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?
23 నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను.
24 నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు.
25 నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు.
26 కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను.
27 తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను.
28 అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.
29 జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది.
30 వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు.
31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.
32 ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది.
33 నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”