జెకర్యా
గ్రంథకర్త
ఈ పుస్తక రచయిత జెకర్యా ప్రవక్త అని 1:1 గుర్తిస్తున్నది. ఇతడు ఇద్దో కుమారుడైన బెరెక్యాకు పుట్టినవాడు. ఇద్దో చెరనుండి తిరిగి వచ్చిన యాజక కుటుంబాలకు చెందిన వాడు (నెహేమ్యా 12:4, 16). జెకర్యా కుటుంబం యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు అతడు బాల్యప్రాయంలో ఉండి ఉండవచ్చు. తన వంశాన్ని బట్టి జెకర్యా ప్రవక్తయే గాక, యాజకుడు కూడా. కాబట్టి యూదుల ఆరాధన క్రమాలతో ఇతనికి సన్నిహిత పరిచయం ఉండవచ్చు. నిర్మించిన ఆలయంలో ఇతడు యాజకుడుగా పని చేశాడో లేదో తేలియదు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 520 - 480
బబులోను చెర తరువాత గ్రంథ రచన జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకమునుపు 1-8 ఆధ్యాయాలు రాశాడు. పూర్తి అయిన తరువాత 9-14 అధ్యాయాలు రాశాడు.
స్వీకర్త
చెరనుండి తిరిగి వచ్చి యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు.
ప్రయోజనం
శేష ప్రజకు జెకర్యా రాస్తూ భావికాలంలో రాబోతున్న యేసు క్రీస్తు అనే మెస్సీయ రాక కోసం ఎదురు చూసే ఆశాభావం, అవగాహన కల్పించాడు. దేవుడు తన ప్రజలకు హెచ్చరిక, ఉపదేశం, దిద్దుబాటు కలిగించడానికి తన ప్రవక్తలను వాడుకుంటాడు. దురదృష్ట వశాత్తూ వారు వినడానికి నిరాకరించారు. వారి పాపం దేవుని శిక్షను తెచ్చిపెట్టింది. ప్రవచనాలు సైతం అబద్దాలై ఉండ వచ్చని ఈ గ్రంధం రుజువులు చూపుతున్నది.
ముఖ్యాంశం
దేవుని విడుదల
విభాగాలు
1. పశ్చాత్తాపానికై పిలుపు — 1:1-6
2. జెకర్యా దర్శనాలు — 1:7-6:15
3. ఉపవాసాల గురించిన ప్రశ్నలు — 7:1-8:23
4. భావికాలం గురించి భారం — 9:1-14:21
1
దేవుని వైపు తిరుగుటకు పిలుపు
దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.
“యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”
“మీ పితరులు ఏమయ్యారు?
ప్రవక్తలు కలకాలం జీవిస్తారా?
అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”
గంజి చెట్ల మధ్య కనిపించిన వ్యక్తి
దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది. రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి. అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు.
10 అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు. 11 అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు. 12 అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు. 13 నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు.
14 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది. 15 ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు. 16 కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు. 17 నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”
నాలుగు కొమ్ములు, నలుగురు కంసాలిలు
18 ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి. 19 “ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.
20 అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు. 21 “వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.