10
కొత్త రాతి పలకలు
“ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే నీ కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’
“కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”
(ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసెరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసెరునుండి గుద్గోదకు వెళ్లారు. మరియు వారు గుద్గోదనుండి నదులుగల యొత్బాతా దేశం వెళ్లారు. ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను* మోయాల్సిన పని వారిది. యెహోవా ఆంలయలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు. అందువల్లనే యితర వంశాలవలె లేవీ వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే.)
10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’ అని నాతో చెప్పాడు.
నిజంగా యెహోవా కోరేది
12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.
14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజ కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.
16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.
20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.
* 10:8 యెహోవా ఒడంబడిక పెట్టె పది ఆజ్ఞలు వ్రాయబడ్డ రెండు రాతిపలకలు మొదలైనవి ఉంచబడిన పెట్టె. అనగా మందసము.