39
బబలోను నుంచి సందేశహరులు
ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోద క్బలదాను బబలోనుకు రాజు. మెరోదక్ ఉత్తరాలు, కానుకలు హిజ్కియాకు పంపించాడు. హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల మెరోదక్ కానుకలు పంపించాడు. ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్ మనుష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడనిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి చూపించాడు.
ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?”అని అతన్ని అడిగాడు.
“ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబలోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.
కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి చూశారు?” అని అతణ్ణి అడిగాడు.
“నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని చెప్పాడు హిజ్కియా.
హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు. భవిష్యత్తులో, నీకు ఉన్నదంతా బబలోనుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు ఇది. బబలోను రాజు నీ కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని పోతాడు. నీ కుమారులు బబలోను రాజభవనంలో అధికారులు అవుతారు.”
హిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అనుకొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.)