27
అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు:
 
“నిజంగా దేవుడు జీవిస్తున్నాడు.
మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం.
అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.
కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు.
మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను.
నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.
నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను.
సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు.
నా శత్రువులు దుర్మారులు శిక్షించబడినట్టు శిక్షించబడుదురు గాక.
దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు.
అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.
ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి,
దేవునికి మొరపెడితే దేవుడు వినడు.
10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది.
ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.
 
11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను.
సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.
12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు.
కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?
13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే.
సర్వశక్తిమంతుడైన దేవుని నుండి కృర మానవులకు లభించేది ఇదే.
14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు.
దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.
15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది.
అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు.
ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.
17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు.
దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.
18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు.
అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.
19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు.
కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తంది.
20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి.
రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టు కొని పోతుంది.
21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు.
తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.
22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.
23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు.
దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.”