2
విశ్వాసంలేని యూదా 
 
1 యెహోవా యొక్క వర్తమానం నాకు వినిపించింది. యెహోవా వాక్కు ఇలా వుంది:  
2 “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి:  
   
 
“ ‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు.  
ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు.  
ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను  
నీవు నన్ను అనుసరించావు.   
3 ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము:  
వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం.  
ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు.  
ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’ ”  
ఇది యెహోవా వాక్కు.   
   
 
4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.  
ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.   
   
 
5 యెహోవా ఇలా చెప్పాడు:  
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?  
అందుకేనా వారు నాపట్ల విముఖులై నారు?  
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.  
తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.   
6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి  
తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?  
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన  
యెహోవా ఎక్కడ ఉన్నాడు?  
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో  
సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?  
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,  
ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.  
ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.  
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’  
మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”   
   
 
7 ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో  
నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.  
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.  
కాని మీరు వచ్చినా దేశాన్ని అపవిత్ర పర్చారు.  
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.  
అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.   
   
 
8 “యెహోవా ఎక్కడ అని  
యాజకులు అడగలేదు.  
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసు కోవటానికి నిరాకరించారు.  
ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.  
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.  
వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”   
9 కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను  
నేను నిందిస్తున్నాను.   
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి.  
ఒకనిని కేదారు రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి.  
అక్కడ ఎవరైనా ఈ రకంగా  
ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.   
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను  
కొత్త దేవుళ్లతో మార్చుకున్నారు?  
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు  
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని  
పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.   
   
 
12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.  
భయకంపితులుకండి!”  
యెహోవా ఇలా చెప్పాడు.   
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:  
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు  
పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.  
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)  
కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.   
   
 
14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు?  
వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా?  
ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?   
15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి.  
సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ప్రజలు దేశాన్ని సింహాలు నాశనం చేశాయి.  
ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి.  
అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.   
16 మెమ్ఫిస్, తహపనేసు వీటినుండి వచ్చిన  
యోధులు నీ తల చితుకగొట్టారు.   
17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం!  
చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న  
మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు   
18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి:  
ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా?  
నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది?  
లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది?  
యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.   
19 మీరు చెడు పనులు చేశారు.  
మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి.  
మీకు కష్టాలు సంభవిస్తాయి.  
ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది.  
దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది.  
నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!”  
ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.   
20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు.  
నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు.  
‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు.  
నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుకింద  
పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.   
21 యూదా, నిన్నొక మేలు రకం ద్రాక్షపాదువలెనాటాను.  
మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు.  
కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?   
22 క్షారజలంతో స్నానం చేసుకున్నా,  
నీవు విస్తరించి సబ్బు వినియోగించినా  
నేను నీ దోష కళంకాన్ని చూడగలను.”  
ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.   
23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’  
నీ వెలా నాకు చెప్పగలవు?  
లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో.  
నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో.  
నీవొక వడిగల ఆడ ఒంటివలె  
ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.   
24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు.  
సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది.  
మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు.  
ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు.  
అప్పుడు దానిని కనుగొనటం తేలిక.   
25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి.  
ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు.  
కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను!  
నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను.  
నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.   
   
 
26 “ప్రజలు పట్టుకున్నప్పుడు  
దొంగ సిగ్గుపడతాడు  
అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు.  
ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.   
27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు!  
దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు.  
ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు.  
దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు.  
ఆ ప్రజలంతా అవమానం పొందుతారు.  
ఆ ప్రజలు నావైపుకు చూడరు.  
వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు.  
కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు,  
‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.   
28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి?  
మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము.  
యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!   
   
 
29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు?  
మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.”  
ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.   
30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను.  
కాని అది పనిచేయలేదు.  
మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా  
మీరు వెనక్కి మరలలేదు.  
మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు.  
మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”   
31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి.  
   
 
“ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా?  
వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా?  
‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది.  
యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు.  
కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?   
32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!  
ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!  
కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.   
   
 
33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు.  
కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.   
34 మీ చేతులు రక్తసిక్తమైనాయి!  
అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.   
35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’  
అని నీవు చెప్పుకుంటూ ఉంటావు.  
అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను,  
ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.   
36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని!  
అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది.  
అందుచేత అష్షూరును వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు.  
ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.   
37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు.  
అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు.  
కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు.  
ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.