2
సొలొమోనుకు దావీదు హితోపదేశం
దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు: “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పిన వన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’ ”
“సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి. కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
“గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
“గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసిషిమీని నేను చంపనని చెప్పాను. కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. 11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు*
13 ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు.
“నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది.
“అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం. 14 నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు.
“అయితే మాట్లాడు” అన్నది బత్షెబ.
15 అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు. 16 కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.”
“నీకేం కావాలి?” అని బత్షెబ అడిగింది.
17 “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు.
18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడ తాను” అని బత్షెబ అన్నది.
19 కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి పక్కగా కూర్చున్నది.
20 “నిన్నొక చిన్న విషయం అడగాలని వచ్చాను. దయచేసి తిరస్కరించవద్దు” అని బత్షెబ అతనితో అన్నది.
“నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! నేనెప్పుడూ తిరస్కరించను” అని రాజు అన్నాడు.
21 “అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోదరుడైన అదోనీయా వివాహమాడుటకు అనుమతి ఇవ్వు” అని బత్షెబ అన్నది.
22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
23 అప్పుడు సొలొమోను యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయానన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను! ఇది వాని ప్రాణానికే ముప్పుతెస్తుందని ప్రమాణ వూర్వకంగా చెపుతున్నాను! 24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెపుతున్నాను!”
25 రాజైన సొలొమోను బెనాయాను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీయాను చంపేశాడు.
26 రాజైన సొలొమోను యాజకుడగు అబ్యాతారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని. కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు నీవు యెహోవా పవిత్ర పెట్టె మోయుటలో సహాయ పడ్డావు. పైగా నీవు నా తండ్రి కష్ట సమయాలలో నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు తెలుసు.” 27 అయితే ఇక నుంచి యెహోవా యాజకునిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సొలొమోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది.
28 యోవాబు జరిగినదంతా విని భయపడి పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు గాని, అబ్షాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నాడు. 29 యోవాబు దేవుని గుడారంలో బలి పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజైన సొలొమోనుకు చెప్పారు. సొలొమోను బెనాయాను పిలచి యోవాబును చంపమన్నాడు.
30 బెనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవాబుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని” చెప్పాడు.
“వద్దు, నేనిక్కడే చనిపోతాను” అని యోవాబు అన్నాడు.
కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న మాటలు రాజుకు చెప్పాడు. 31 “అయితే అతను చెప్పినట్లే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా యోవాబు అమాయకులను చంపాడు. 32 తనకంటె చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. వారిద్దరు నేరు కుమారుడైన అబ్నేరు, మరియు యెతెరు కుమారుడైన అమాశా. అబ్నేరు ఇశ్రాయేలు సైన్యాధిపతి. అమాశా యూదావారి సైన్యాధిపతి. అతడు వారిని చంపినట్లు నా తండ్రి దావీదుకు తెలియదు. కావున యెహోవా అతనికి తగిన శాస్తి చేస్తాడు. 33 వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.”
34 కావున యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు. 35 తరువాత యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను సైన్యాధ్యక్షునిగా సొలొమోను నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో సొదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా నియమించాడు. 36 తరువాత, షిమీని రాజు పిలిచాడు. రాజు షిమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, నగరం వదిలి వెళ్లవద్దు. 37 నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు నీవే బాధ్యుడవు” అని అన్నాడు.
38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివసించాడు. 39 కాని మూడు సంవత్సరాల తరువాత షిమీ యొక్క ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్లు షిమీ విన్నాడు. 40 తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలును వెదుక్కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు.
41 కాని ఎవ్వరో సొలొమోను వద్దకు వెళ్లి షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.
42 అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికైనా వెళ్లితే తత్ఫలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడవవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై వుంటానని నీవు అన్నావు. 43 మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకోలేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు? 44 నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు. 45 కాని యెహోవానన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు.”
46 పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
* 2:12 ఆతడు … అనుమానం లేదు ఆతని రాజ్యం స్థిరంగా నెల కొల్పబడింది అని పాఠాంతరం.