9
ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం
తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.
 
“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
యెహోవా, నీవే దేవుడిని.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
సహాయార్థం ఎర్ర సముద్ర తీరానవారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటెతాము గొప్ప అని
ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నువ్వు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నువ్వు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
వాళ్లకి నీవు రాయినుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.
వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.
వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు.
వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు,
వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు.
 
“నీవు క్షమాశీలివి!
నీవు దయామయుడివి. కరుణామయుడివి.
నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు.
అందుకే నీవు వాళ్లను విడువలేదు.
18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, “మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే, వీరే”
అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
19 నీవెంతో దయామయుడివి!
అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు.
పగటివేళ మేఘస్థంభాన్ని
వాళ్లనుంచి తప్పించలేదు.
వాళ్లని నడిపిస్తూనే వచ్చావు.
రాత్రివేళ దీపస్తంభాన్ని
వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు.
వాళ్ల బాటకి వెలుగు చూపుతునే వచ్చి
వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.
వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు.
వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!
ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు.
వాళ్ల దుస్తులు చీకిపోలేదు.
వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,
జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు.
హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ,
బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.
వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి.
వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి
నీవు వాళ్లని తీసు కొచ్చావు.
వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.
అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు.
ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు!
ఆ దేశ ప్రజలను, రాజులను
నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
25 వాళ్ల బలీయమైన నగరాలను ఓడించారు.
సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు.
మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ,
అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి.
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి.
వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు.
వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు!
వాళ్లు నీ బోధనలను తోసిపుచ్చారు!
వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు.
ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం,
వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం.
కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణా లెన్నో చేశారు!
27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు.
శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు.
కష్టాలు ఎదురై నప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు.
పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు.
నీవు చాలా దయాశీలివి.
అందు కని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు.
ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.
28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి
ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు!
నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు.
వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు.
పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు.
నీవెంతో దయామయుడివి!
ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు!
29 నీవు వాళ్లని హెచ్చరించావు.
మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు.
అయితే, వాళ్లు మరీ గర్వపడి,
నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు.
జనం నీ ఆజ్ఞలను పాటిస్తే
వాళ్లు నిజంగా బతుకుతారు.
కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లనఘించారు
వాళ్లు మొండివారై,
నీకు పెడ ముఖమయ్యారు,
నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు.
 
30 “నీవు మా పూర్వీకుల పట్ట చాలా ఓర్పువహించావు.
వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు.
నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు.
వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు.
కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు.
అందుకే నువ్వు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.
 
31 “అయితే, నీవెంతో దయామయుడివి!
వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు.
నీవు వాళ్లని విడువలేదు.
నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!
32 మా దేవా, నీవు మహా దేవుడివి,
భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి!
నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి!
ఒడంబడికను తప్పని వాడివి!
మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి.
మా కష్టాలు నీవు పట్టించుకుంటావు!
మా ప్రజలందరికీ,
మా రాజులకీ, మా పెద్దలకీ,
మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి.
అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి!
కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి!
33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు,
మాదే తప్పు.
34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు.
వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు,
నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు.
35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు.
వాళ్లు దుష్టుకార్యాలు చేయడం మానలేదు.
నీవు వాళ్ల కిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు.
వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు,
అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
36 మరి ఇప్పుడు, మేము బానిసలము.
మేమీ భూమిలో ఏ భూమినీ,
దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ
అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో,
ఆ భూమిలో మేము ఈనాడు దాసులము.
37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే
కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది.
ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు.
తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు.
దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
38 వీటన్నింటి మూలంగా,
మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము.
మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసు కొంటున్నాము.
మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి,
ఒక ముద్రతో దానికి ముద్ర* వేస్తున్నారు.”
* 9:38 ముద్ర రబ్బరు స్టాంపులా ఉపయోగించడానికి వీలైనచిన్నరాతి ముక్కలు, లేక ఉంగరాలు. తడి మట్టిలో గాని, కరిగిన మైనంలో గాని ఈ ముద్రికను ఒత్తితే, అవి ఒక ప్రత్యేక ముద్రను మిగులుస్తాయి. ఆ ముద్ర సంతకంతో సమానం.