25
దావీదు మరియు మూర్ఖుడైన నాబాలు
సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రాయేలీయులు సమూయేలు మృతికి తమ సంతాపాన్ని వెలిబుచ్చురు. రామాలో వున్న ఇతని ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు సమాధి చేశారు.
అప్పుడు దావీదు పారాను అరణ్యానికి తరలిపోయాడు. మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. అతని పేరు నాబాలు.* అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.
దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు. “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను, నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులన కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు. నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడునైన దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.
దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు. 10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు! 11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురు కున్నాడు నాబాలు.
12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు. 13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందర మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.
అబీగయీలు ఆపదను తప్పించుట
14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. 15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలిచలేదు. 16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు. 17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.
18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది. 19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.
20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.
21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. 22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.
23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది. 24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు. 25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. 26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యోహవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక! 27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు. 28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు. 29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు. 30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు. 31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నాది.
32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు. 33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు. 34 ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.
35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.
నాబాలు మరణము
36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు. 37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి రాయిలా బిగుసుకుపోయాడు. 38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.
39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు.
అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు. 40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు. 41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది. 43 యెజ్రెయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగయీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు. 44 సౌలు కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, సౌలు ఆమెను గల్లీముకు చెందిన లాయీషు అనే వాని కుమారుడు పల్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు.
* 25:3 నాబాలు బుద్ధిహీనుడు అని దీని అర్థం. 25:8 స్నేహితుడు కుమారుడు అని మూలభాషలో రాయబడింది. 25:41 సేవకుల పాదప్రక్షాళనం దావీదు కాలంలో ఒక వ్యక్తి ప్రజల కాళ్లు కడిగితే ఆ వ్యక్తి యొక్క అణుకువకు, నమ్రతకు గుర్తు.