7
యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట
దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవా నుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లరు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక వ్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటి స్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”
సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను: “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొకకేనా? కాదు! మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే. దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణపల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’ ”
 
యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి.
మీ అందరూ ఒకరికొకరు దయ,
కరుణ కలిగి ఉండాలి.
10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను,
కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు.
కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే
ఆలోచన కూడూ మీరు రానీయకండి!”
 
11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు.
ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు.
దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు
తమ చెవులు మూసుకున్నారు.
12 వారు చాలా మొండి వైఖరి దాల్చారు.
వారు న్యాయాన్ని పాటించరు.
ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు
ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు.
కాని ప్రజలు వాటిని వినరాయెను.
అందువల్ల సర్వశక్తి మంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు,
“నేను వారిని పిలిచాను,
కాని వారు పలకలేదు.
అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే
నేను పలకను.
14 ఇతర దేశాలను వారి మీదిరి ఒక తుఫానులా తీసుకువస్తాను.
వారెవరో వీరికి ెతెలియదు;
కాని వారు దేశంలో తిరిగాక
అది నాశనమై పోతుంది.
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”