హెబ్రీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
పత్రిక రచయిత ఎవరు అన్నది ప్రశ్నార్ధకంగా ఉండిపోయింది. కొందరు పండితులు దీన్ని రాసింది పౌలు అన్నారు. అయితే అసలైన రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు. క్రైస్తవానికి ప్రధాన యాజకునిగా ఇంట బాగా మరి ఏ ఇతర పుస్తకం కూడా వర్ణించలేదు. ఈయనది ఆహారోను యాజకత్వం కన్నా మిన్న. ఈయనే ధర్మశాస్త్రం, ప్రవక్తలకు నెరవేర్పు. క్రీస్తును మన విశ్వాసానికి కర్త, కొనసాగించే వాడుగా ఈ పుస్తకం చూపెడుతున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 65 - 70
దీన్ని యెరూషలేములో రాశారు. క్రీస్తు ఆరోహణం, యెరూషలేము నాశనం మధ్య కాలంలో రచన జరిగింది.
స్వీకర్త
ఈ పుస్తకం పాత నిబంధన లేఖనాలతో పరిచయం ఉన్న యూదు విశ్వాసుల కోసం. వీరు ఆ సమయంలో తిరిగి యూదు మతానికి వెళ్ళిపోవడం, లేక సువార్తకు యూదు మతం రంగు పులమడం అనే శోధన కింద ఉన్నారు. ఇంకా క్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన అనేక మంది యాజకుల కోసం రాసినది అని కూడా అంటారు (అపో. కా. 6:7).
ప్రయోజనం
స్థానిక యూదు ప్రబోధాలను తిరస్కరించాలని రచయిత పురిగొల్పుతున్నాడు. వారు యేసుకు కట్టుబడి ఉండాలి. ఆయనే అందరికన్నా శ్రేష్టుడు. దైవ కుమారుడు దేవా దూతలకన్నా యాజకులకన్నా పాత నిబంధన నాయకుల కన్నా ఏ మతం కన్నా కూడా అధికుడు. సిలువపై మరణించి, తిరిగి లేవడం ద్వారా అయన విశ్వాసులకు నిత్య జీవం, రక్షణ ఇస్తున్నాడు. మన పాపాలకోసం క్రీస్తు బలి పరిపూర్ణం. విశ్వాసం అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. దేవునికి లోబడడం ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడిస్తాము.
ముఖ్యాంశం
క్రీస్తు ఆధిక్యత
విభాగాలు
1. యేసు క్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు — 1:1-2:18
2. ధర్మ శాస్త్రం, పాత నిబంధన కంటే యేసు క్రీస్తు గొప్పవాడు — 3:1-10:18
3. బాధల్లో నమ్మకంగా నిలకడగా ఉండాలని పిలుపు — 10:19-12:29
4. చివరి హెచ్చరికలు, అభివాదాలు — 13:1-25
1
గొప్ప రక్షణ
(1) కుమారుడు ప్రవక్తలకంటే గొప్పవాడు
పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
(2) కుమారుడు దేవదూతల కంటే గొప్పవాడు
దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. ఎందుకంటే దేవుడు,
“నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.”
అని గానీ,
“నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు”
అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా? అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు,
“దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.
తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన,
“దేవదూతలను ఆత్మలుగానూ,
తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు.
అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు.
“దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది.
నీ రాజదండం న్యాయదండం.
నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు.
కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే
ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.
10 ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు.
నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.
11 అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు.
బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి.
12 వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు.
బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు.
కానీ నువ్వు ఒకేలా ఉంటావు.
నీ సంవత్సరాలు ముగిసిపోవు.”
13 “నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో”
అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? 14 ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?