యెషయా
గ్రంథకర్త
దీని రచయిత యెషయా పేరును బట్టి ఈ పుస్తకానికి పేరు వచ్చింది. ఇతడొక ప్రవక్తను వివాహమాడగా వారికి కనీసం ఇద్దరు మగపిల్లలు పుట్టారు (యెషయా 7:3; 8:3). నలుగురు యూదా రాజులు (ఉజ్జియా, యెతాము, ఆహాజు, హిజ్కియా 1:1) పరిపాలన కాలంలో ఇతడు ప్రవచనాలు చెప్పాడు. ఐదవ రాజు దుర్మార్గుడైన మనష్హే పాలనలో హతమయ్యాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 740 - 680
ఉజ్జియా రాజు పరిపాలన చివరి దశలో యెతాము, ఆహాజు, హిజ్కియా పరిపాలన కాలంలో ఈ గ్రంథ రచన జరిగింది.
స్వీకర్త
దేవుని ధర్మశాస్త్ర విధుల ప్రకారం జీవించకుండా తప్పిపోతున్న యూదా ప్రజలకోసం ఈ గ్రంథంలోని ప్రవచనాలు ఉన్నాయి.
ప్రయోజనం
పాత నిబంధన అంతటిలొకీ అత్యంత సమగ్రమైన రీతిలో యేసుక్రీస్తును చూపేపే చిత్రాన్ని ఆవిష్కరింప జేయడం యెషయా గ్రంథం ఉద్దేశం. ఆయన జీవితం యొక్క విస్త్రత వర్ణన ఇందులో ఉంది. ఆయన రాకడ ప్రకటన (40:3-5), ఆయన కన్యకు జన్మించడం (7:14), ఆయన ప్రకటించనున్నసువార్త (61:1), త్యాగభరిత మరణం (52:13-53:12), తన వారిని పొందడం కోసం ఆయన మళ్ళీ రావడం (60:2-3) యెషయా ప్రవక్త పిలుపు ముఖ్యంగా యూదా రాజ్యానికి ప్రవచనాలు వినిపించడం. యూదా రాజ్యం తిరుగుబాటు, ఉజ్జీవం అనుభవిస్తున్నది. అష్హురు, ఈజిప్టు రాజ్యాలు యూదాను నాశనం చేస్తామని బెదిరిస్తున్నాయి. అయితే దేవుని కరుణను బట్టి ఆ బెదిరింపులను ఆ జాతి తప్పించుకోగలుగుతున్నది. పాపం విషయంలో పశ్చాత్తాపం, దేవుని విమోచన లభించే భవిష్యత్తు అనే ప్రకటన యెషయా ప్రవచనాల్లో కనిపిస్తుంది.
ముఖ్యాంశం
రక్షణ
విభాగాలు
1. యూదా భ్రష్టత్వం — 1:1-12:6
2. ఇతర జాతుల భ్రష్టత్వం — 13:1-23:18
3. భావి హింసాకాలం — 24:1-27:13
4. ఇశ్రాయేలు యూదాల భ్రష్టత్వం — 28:1-35:10
5. హిజ్కియా మరియు యెషయా చరిత్ర — 36:1-38:22
6. బాబిలోనియన్ నేపద్యం — 39:1-47:15
7. శాంతికై దేవుని ప్రణాళిక — 48:1-66:24
1
దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు
యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.
ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.
“నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు.
ఎద్దుకు తన యజమాని తెలుసు.
తన మేత తొట్టి గాడిదకు తెలుసు.
కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.”
ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా,
దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ.
వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు.
ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు.
ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు.
మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?
మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే.
అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.
ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు.
అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు,
కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.
మీ దేశం పాడైపోయింది.
మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి.
మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు.
తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు.
సీయోను కుమార్తె *ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా,
దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది.
జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,
మనం సొదొమలాగా ఉండేవాళ్ళం.
మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.
10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.
గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.
11 “యెహోవా ఇలా అంటున్నాడు.
విస్తారమైన మీ బలులు నాకెందుకు?”
“దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి.
దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు.
12 మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,
నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు?
13 అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.
అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.
14 మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.
వాటిని సహించలేక విసిగిపోయాను.
15 మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.
మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను.
మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.
16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.
మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి.
మీ దుష్టత్వం మానండి.”
17 మంచి చెయ్యడం నేర్చుకోండి.
న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.
తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.
వితంతువు పక్షాన నిలబడండి.
18 యెహోవా ఇలా అంటున్నాడు.
“రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.”
“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,
అవి మంచులా తెల్లగా అవుతాయి.
కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.
19 మీరు ఇష్టపడి నాకు లోబడితే,
మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు.
20 తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,
కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.”
యెహోవా నోరు ఈ మాట పలికింది.
21 నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!
అది న్యాయంతో నిండి ఉండేది.
నీతి దానిలో నివాసం ఉండేది.
ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.
22 నీ వెండి మలినమైపోయింది.
నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.
23 నీ అధికారులు ద్రోహులు.
వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు.
అందరూ లంచం ఆశిస్తారు.
చెల్లింపుల వెంటబడతారు.
తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు.
వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.
24 కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు.
“వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను.
నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను.
25 నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను.
నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను.
26 మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను.
ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను.
అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.”
27 సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది.
28 అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు.
యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు.
29 “మీరు కోరుకున్న సింధూర వృక్షాలను బట్టి మీరు సిగ్గుపడతారు.
మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు.
30 మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు.
31 బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు.
అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి.
ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.”
* 1:8 1:8 సీయోను కుమార్తె యెరూషలేము పట్టణం 1:29 1:29 సింధూర వృక్షాలను విగ్రహ పూజ