15
మోయాబు గురించి ప్రకటన
16:6-12; యిర్మీ 48:29-36
మోయాబు గురించి ప్రకటన.
ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
ఏడవడానికి మోయాబీయులు గుడికీ,
మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు.
నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు.
వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు,
గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు.
వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి.
యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది.
మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు.
వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది.
దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు.
లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు.
నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి.
గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది.
అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.
కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను.
మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.