20
జోఫరు
అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు,
నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది.
నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది.
ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా?
దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.
వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.
అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.
కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.
వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు.
10 వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో* ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు.
11 వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.
12 చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు.
13 దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.
14 అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది.
15 వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.
16 వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.
17 తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.
18 వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు.
19 వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.
20 వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు.
21 వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు.
22 వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు.
23 వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.
24 ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.
25 ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది.
26 వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది.
27 వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది.
28 వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది.
29 దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.
* 20:10 20:10 వారి చేతుల్లో వారి పిల్లలు