28
వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.
ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.
మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.
మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.
భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.
దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.
వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.
గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.
మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
10 శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.
11 నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.
12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
13 మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.
14 అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.
15 బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.
16 అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.
17 సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.
18 పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది.
19 కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.
20 అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
21 అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.
22 “మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి.
23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.
24 ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.
25 గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,
26 వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,
27 ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.
28 యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.