33
పునరుద్ధరణ వాగ్దానం
యిర్మీయా ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “సృష్టికర్త అయిన యెహోవా, రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా, యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు, నాకు మొర పెట్టు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, నీకు అర్థం కాని మర్మాలు నీకు వివరిస్తాను.
ముట్టడి దిబ్బల వలనా, ఖడ్గం వలనా నాశనమైన పట్టణంలోని యూదా రాజుల గృహాల విషయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు. ‘యుద్ధం చెయ్యడానికి కల్దీయులు వస్తున్నారు. నా ఉగ్రతను బట్టి, నా ఆగ్రహాన్ని బట్టి, తమ దుష్టత్వం కారణంగా నేను ఈ పట్టణం నుండి ముఖం తిప్పేసుకున్నందు వల్ల హతమయ్యే ప్రజల శవాలతో ఆ ఇళ్ళను నింపడానికి వారు వస్తున్నారు.
కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను. యూదా, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ భాగ్యం మళ్ళీ తీసుకొస్తాను. ఆరంభంలో ఉన్నట్టు వాళ్ళను నిర్మాణం చేస్తాను.
అప్పుడు వాళ్ళు నాకు విరోధంగా చేసిన దోషాల నుంచి వాళ్ళను పవిత్రం చేస్తాను. నాకు విరోధంగా చేసిన వాళ్ళ దోషాలనూ తిరుగుబాటునూ క్షమిస్తాను. నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’ ”
10 యెహోవా ఇలా అంటున్నాడు. “ ‘ఇది నివాసయోగ్యం కాదు, యూదా పట్టణాల్లో మనుషులు లేరు, జంతువులు లేవు, యెరూషలేము వీధుల్లో జనంగానీ, జంతువులుగానీ లేవు’ అని మీరు చెప్పే ఈ స్థలాల్లోనే, 11 సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు.
12 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి. 13 మన్య పట్టణాల్లో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశపు పట్టణాల్లో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించుకుంటూ తిరుగుతారు.”
14 యెహోవా వాక్కు ఇదే. “చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి. 15 ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు. 16 ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
17 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు “ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు సంతతివాడు ఒకడు లేకుండా పోడు, 18 నా సన్నిధిలో నిత్యం దహన బలులు అర్పించడానికీ, నైవేద్యాలు అర్పించడానికీ, ధాన్య అర్పణలు అర్పించడానికీ యాజకులైన లేవీయుల్లో ఒకడు ఎప్పుడూ లేకుండా ఉండడు.”
19 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 20 యెహోవా ఇలా అంటున్నాడు. “దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే, 21 అప్పుడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని పాలించే వారసుడు అతనికి ఉండకుండా మానడని అతనితో, నా సేవకులైన లేవీయులతో, యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్ధం అవుతుంది. 22 ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులు లెక్కపెట్టడం సాధ్యం కానట్టే, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీయులను లెక్క పెట్టలేనంతగా నేను అధికం చేస్తాను.”
23 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 24 తాను ఏర్పరచుకున్న రెండు వంశాలను యెహోవా తిరస్కరించాడు, నా ప్రజలు ఇకమీదట తమ దృష్టిలో ఒక జనాంగంగా ఉండరు, అని, ఈ రకంగా నా ప్రజలను తృణీకరిస్తూ ఈ ప్రజలు చెప్పుకునే మాట గురించి నువ్వు ఆలోచించలేదా?
25 యెహోవానైన నేను ఇలా అంటున్నాను, “పగలు గురించి, రాత్రి గురించి, నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే, 26 భూమ్యాకాశాలను గురించిన నిబంధన నిలిచి ఉండకపోతే, అప్పుడు మాత్రమే అబ్రాహాము ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని పరిపాలించడానికి అతని సంతాన సంబంధి అయిన వ్యక్తిని ఏర్పరచుకోకుండా, నేను యాకోబు సంతానంలోని నా సేవకుడైన దావీదు సంతానాన్ని తృణీకరిస్తాను. కచ్చితంగా నేను వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.”