20
శరణార్థుల నగరాలు
యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు, “నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పాలి, తెలియక పొరపాటున ఎవరినైనా చంపిన హంతకుడు పారిపోడానికి నేను మోషే ద్వారా మీతో పలికించిన ఆశ్రయ పట్టణాలు మీరు ఏర్పరచుకోవాలి. హత్య విషయమై ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పట్టణాలవుతాయి. ఒకడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి ఆ పట్టణ ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దలు వినేలా తన సంగతి చెప్పిన తరువాత, వారు పట్టణంలోకి అతనిని చేర్చుకుని తమ దగ్గర నివసించడానికి స్థలమివ్వాలి.
హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు అతనిని తరిమితే అతని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎందుకంటే అతడు పొరపాటున తన పొరుగువాని చంపాడు గాని అంతకు మునుపు వాని మీద పగపట్టలేదు. అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ, ఆ రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ ఆ పట్టణంలోనే నివసించాలి. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయాడో ఆ పట్టణంలోని తన ఇంటికి తిరిగి రావాలి.”
అప్పుడు వాళ్ళు గలిలీలోని నఫ్తాలి కొండ ప్రదేశంలో ఉన్న కెదెషు, ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని షెకెం, యూదా కొండ ప్రదేశంలోని హెబ్రోను అనే కిర్యతర్బాను ప్రతిష్ఠించారు. తూర్పు వైపున యొర్దాను అవతల యెరికో దగ్గర రూబేను గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసెరు, గాదు గోత్రం నుండి గిలాదు లోని రామోతు, మనష్షే గోత్రం నుండి బాషానులోని గోలానులను నియమించారు. పొరపాటున ఒకడి చంపినవాడు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేసేవాడు చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకూ ఇశ్రాయేలీయులందరికీ వారిమధ్య నివసించే పరదేశులకూ నియమించిన పట్టణాలు ఇవి.