13
ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు
యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.
అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి. అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.
యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా. యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు
10 యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు. 11 ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు. 12 యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించీ యూదా రాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరచిన పరాక్రమం గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.
13 యెహోయాషు తన పూర్వికులతో కన్నుమూసిన తరవాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు.
ఎలీషా మరణం
14 ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.
15 అప్పుడు ఎలీషా “విల్లంబులు తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు. 16 “నీ చెయ్యి విల్లుపై వెయ్యి” అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి 17 “తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు. 18 ఈసారి ఎలీషా “బాణాలు పట్టుకో” అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో “నేలను కొట్టు” అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.
19 అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి “నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు” అని చెప్పాడు.
20 తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు. 21 కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.
22 యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు. 23 అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు. 24 సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.
25 యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.