2
ఏలీయా పరలోకానికి తీసుకువెళ్ళడం
యెహోవా ఏలీయాను సుడిగాలిలో పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి ఏలీయా ఎలీషాతో కలసి గిల్గాలు నుండి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను బేతేలుకు వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను. నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు.
బేతేలులో ఉన్న ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. “ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?” అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా “నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి” అని జవాబిచ్చాడు. అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యెరికోకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ యెరికోకి వెళ్ళారు.
అప్పుడు యెరికోలో కూడా ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. “ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?” అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా “నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి” అని జవాబిచ్చాడు. అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు.
తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.
వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. “నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.” అందుకు ఎలీషా “నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి” అన్నాడు. 10 అందుకు ఏలీయా “నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు” అన్నాడు.
11 వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 12 ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు.
ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు.
ఎలీషా సేవ ప్రారంభం
13 ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. 14 నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.
15 యెరికోలో ఉన్న ప్రవక్తల సమాజం వారు అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతని చూడగానే “ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పుకున్నారు. వారు అతణ్ణి కలుసుకోడానికి వెళ్ళి నేల వరకూ వంగి అతనికి నమస్కారం చేశారు. 16 వారు అతనితో “నీ సేవకులైన మా దగ్గర యాభై మంది బలమైన వారున్నారు. నీ గురువును వెదకడానికి వాళ్ళను వెళ్ళనివ్వు. ఒకవేళ యెహోవా ఆత్మ అతణ్ణి పైకి తీసుకు వెళ్ళి ఏ పర్వతం మీదనో, ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు” అని మనవి చేశారు. దానికి ఎలీషా “వద్దు, ఎవర్నీ పంపకండి” అని జవాబిచ్చాడు.
17 అయితే వారు అతణ్ణి బాగా ఒత్తిడి చేసి విసిగించారు. దాంతో అతడు “సరే పంపండి” అన్నాడు. అప్పుడు వారు యాభై మందిని పంపించారు. వారు వెళ్లి అతని కోసం మూడు రోజులు గాలించారు గానీ అతణ్ణి కనుక్కోలేక పోయారు. 18 దాంతో వారు యెరికో పట్టణంలోనే ఆగి ఉన్న ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చారు. అతడు వాళ్ళతో “వెళ్ళ వద్దని నేను మీకు చెప్పాను కదా” అన్నాడు.
19 తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో “మా గోడు వినండి. మా యజమానులైన మీరు చూస్తున్నట్లు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది. కానీ ఇక్కడి నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది” అన్నారు. 20 దానికి ఎలీషా “ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు.
21 అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.” 22 అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్ళు ఈ రోజు వరకూ ఆరోగ్యకరంగా ఉన్నాయి.
23 తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు. 24 ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి. 25 అప్పుడు అతడు అక్కడ నుండి కర్మెలు పర్వతానికి వెళ్ళాడు. అక్కడనుండి షోమ్రోనుకి తిరిగి వెళ్ళాడు.