రోమీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
రోమా 1:1 ప్రకారం ఈ పత్రిక రాసిన వాడు పౌలు. రోమ్ చక్రవర్తిగా పదహారేళ్ళ నీరో సింహాసనం ఎక్కినా 3 సంవత్సరాలకు పౌలు కొరింతు అనే గ్రీకు పట్టణంలో ఉండి ఈ పత్రిక రాశాడు. ఈ ప్రముఖ పట్టణం లైంగిక అవినీతికీ విగ్రహ పూజకూ పెట్టింది పేరు. కాబట్టి రోమా పత్రికలో పౌలు మానవాళి పాపం గురించి, జీవితాలను అద్భుత రీతిలో పూర్తిగా మార్చగలిగిన దేవుని కృపలోని శక్తిని గురించీ రాస్తున్నప్పుడు తానేమి రాస్తున్నాడో తనకు బాగా తెలుసు ఈ పుస్తకంలోని ముఖ్యాంశం క్రైస్తవ సువార్త సారాంశం. అందులోని కీలకమైన అంశాలన్నీ ఉన్నాయి. దేవుని పవిత్రత, మానవాళి పాపం, యేసు క్రీస్తు ఇవ్వజూపుతున్న రక్షణార్ధం అయిన కృప.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 56 - 57 లో కొరింతు పట్టణం లో గ్రంథ రచన జరిగింది. రచనకు కీలక ప్రదేశం రోమ్.
స్వీకర్త
రోమ్ లో దేవుని ప్రేమను చూరగొని అయన పవిత్ర ప్రజగా ఉండడానికి పిలుపు అందిన వారు. అంటే రోమ్ సామ్రాజ్యానికి ముఖ్య నగరం రోమ్ లో ఉన్న క్రైస్తవ సంఘం.
ప్రయోజనం
క్రైస్తవ సిద్ధాంతాన్ని బహు స్పష్టంగా, ప్రణాళికాబద్ధంగా అందించిన పత్రిక ఇదే. సకల మానవాళి పాపం గురించి చర్చించడం తో పౌలు ఈ పత్రిక ఆరంభించాడు. దేవునికి వ్యతిరేకంగా మన తిరుగుబాటు మూలంగా మనుషులంతా నేరస్థులయ్యారు. అయితే దేవుడు తన కృప చొప్పున తన కుమారుడు క్రీస్తు ద్వారా విశ్వాస మూలమైన నిర్దోషత్వాన్ని మనుషులకు ఇస్తున్నాడు. దేవుడు మనల్ని నిర్దోషులుగా తీర్చినప్పుడు మనకు రక్షణ లేక విమోచన లభిస్తుంది. ఎందుకంటే క్రీస్తు రక్తం మన పాపాలను కప్పి వేస్తుంది. పాపాల నిమిత్తం ఒక మనిషి శిక్షనుండి, పాపం యొక్క ప్రభావం నుండి ఎలా తప్పించుకుంటాడో పౌలు ఇక్కడ వివరించిన అంశాలు సహేతుకమైన, సంపూర్ణమైన అవగాహన ఇస్తున్నాయి.
ముఖ్యాంశం
దేవుని నీతిన్యాయాలు
విభాగాలు
1. పాపానికి దక్కవలసిన శిక్ష, నీతి న్యాయాల ఆవశ్యకత — 1:18-3:20
2. ఆపాదించబడిన నీతిన్యాయాలు, నిర్దోషత్వం — 3:21-5:21
3. అందించిన నీతి న్యాయాలు, పవిత్రీకరణ — 6:1-8:39
4. ఇశ్రాయేల్ కోసం దేవుని సదుపాయం — 9:1-11:36
5. న్యాయ బద్ధమైన మార్గం అమలు — 12:1-15:13
6. ముగింపు: వ్యక్తిగత సందేశాలు — 15:14-16:27
1
ముందు మాట. ముఖ్యాంశం
యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది. మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది. ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము. వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. 9-10 ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి. 11-12 మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.
13 సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష. 14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. 15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.
16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
మొదటి భాగం-దోషభరిత లోకంపై దేవుని ఉగ్రత
18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.
యూదేతరుల భ్రష్టత్వం, ఏడు దశలు
21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.
యూదేతరుల భ్రష్టత్వం ఫలితాలు
24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.
26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.