6
దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం
6:11; 1దిన 13:1-14
6:12-19; 1దిన 15:25-16:3
దేవుని నామాన్ని వెల్లడి పరుస్తూ కెరూబుల మధ్య నివసించే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దేవుని మందసం బాలా యెహూదాలో ఉంది. ఆ మందసాన్ని అక్కడి నుండి తీసుకు రావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి ముప్ఫై వేల మందిని సమకూర్చి బయలుదేరాడు. వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకు బయలుదేరినప్పుడు అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యో కొత్త బండిని తోలారు. దేవుని మందసం ఉన్న ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తెస్తున్నప్పుడు అహ్యో బండికి ముందు నడిచాడు. దావీదు, ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టుకలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు.
వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు. యెహోవా ఉజ్జాను అంతం చేసిన ఆ చోటికి పెరెజ్‌ ఉజ్జా అని పేరు పెట్టారు. ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి “యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?” అనుకున్నాడు. 10 కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడ లేదు. గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకు వచ్చి అక్కడ ఉంచాడు.
11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమునూ, అతని కుటుంబాన్నీ ఆశీర్వదించాడు. 12 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు. 13-14 ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు, దావీదు నారతో నేసిన ఏఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు. 15 ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు.
16 యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది. 17 వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దాని కోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు, దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు. 18 హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు. 19 సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
20 దావీదు తన ఇంటివారిని దీవించడానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె “ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుటా సేవకుల ఎదుటా ఈ రోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు! ఎవడో పనికిమాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేసాడు” అంది. అప్పుడు దావీదు, 21 “నీ తండ్రినీ, అతని సంతానాన్నీ తోసిపుచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి నన్ను ఎన్నుకొన్న యెహోవా సన్నిధిలో నేను అలా చేశాను. యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను. 22 నేను ఇంతకన్నా మరింత హీనంగా నా దృష్టికి నేను తక్కువ వాడనై నువ్వు చెబుతున్న బానిస స్త్రీల దృష్టిలో గొప్పవాడినవుతాను” అని మీకాలుతో అన్నాడు. 23 సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయేంత వరకూ పిల్లలు పుట్టలేదు.