జెఫన్యా  
గ్రంథకర్త  
1:1 లో గ్రంథకర్త తనను “హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యా” అని తనను పరిచయం చేసుకుంటున్నాడు. జెఫన్యా అంటే దేవుని భద్రత కింద ఉన్నవాడు. యిర్మీయాలో ఇతడు యాజకుడుగా కనిపిస్తున్నాడు (21:1; 29:25, 29; 37:3; 52:24). అయితే పైన చెప్పిన జెఫన్యాకు ఇతనికీ సంబంధం లేకపోవచ్చు. జెఫన్యా రాజవంశానికి చెందిన వాడనే వాదం కూడా ఉంది. యెషయా మీకాల తరువాత యూదాపై తాను చెప్పిన ప్రవచనాలను గ్రంథస్థం చేసిన మొదటి ప్రవక్త జెఫన్యాయే.  
రచనా కాలం, ప్రదేశం  
సుమారు క్రీ. పూ. 641 - 620  
యూదా రాజు యెషయా కాలంలో జెఫన్యా ప్రవచించాడని గ్రంథం తెలియజేస్తున్నది (1:1).  
స్వీకర్త  
దక్షిణ యూదా రాజ్యప్రజలు. అంతటా దేవుని ప్రజలందరికీ.  
ప్రయోజనం  
జెఫన్యా తీర్పు, ప్రోత్సహం సందేశంలో మూడు ముఖ్య దైవ సిద్దాంతాలున్నాయి. దేవుడు అన్ని జాతుల మీదా సార్వభౌముడు. తీర్పు దినాన దుష్టులకు శిక్ష, న్యాయవంతులకు మెప్పు కలుగుతుంది. పశ్చాత్తాపపడి తనలో నమ్మకం ఉంచిన వారిని దేవుడు దీవిస్తాడు.  
ముఖ్యాంశం  
యెహోవా దినం  
విభాగాలు  
1. యెహోవా దినాన రానున్న వినాశనం — 1:1-18  
2. ఆశాభావం — 2:1-3  
3. జాతుల వినాశనం — 2:4-15  
4. యెరుషలేము వినాశనం — 3:1-7  
5. ఆశాభావం తిరిగి ఉదయించడం — 3:8-20   
1
1 యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.   
యెరూషలేము పై పడబోయే తీర్పు 
 
2 “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.   
3 మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను.  
ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను.  
భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.   
యూదా వారికి శిక్ష 
 
4 “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి,  
బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.   
5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను,  
యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.   
6 యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”   
7 యెహోవా దినం సమీపించింది.  
ఆయన బలి సిద్ధపరిచాడు.  
తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు.  
యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.   
8 “యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను,  
రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.   
9 ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”   
10 ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని,  
పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది.  
కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది.  
ఇదే యెహోవా వాక్కు.   
11 కనానీయులంతా నాశనమయ్యారు.  
డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.   
12 ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను.  
పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.   
13 వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది.  
వారి ఇళ్ళు పాడైపోతాయి.  
వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు.  
ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.   
మహా ఉగ్రతా దినం 
 
14 యెహోవా మహా దినం దగ్గర పడింది.  
యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది.  
వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది.  
పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.   
15 ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం.  
అంధకారం, మసక కమ్మే రోజు.  
మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.   
16 ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.   
17 ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను.  
వారు గుడ్డివారిలాగా నడుస్తారు.  
వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది.  
వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.   
18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి.  
రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది.  
హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.