15
యెహోవా అబ్రాముతో చేసిన నిబంధన
1 ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి:
“అబ్రామూ, భయపడకు,
నేను నీకు డాలును,
నీ గొప్ప బహుమానాన్ని.”
2 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, నాకు సంతానం లేదు కదా మీరు నాకేమిచ్చినా ఏం లాభం? నా ఆస్తికి వారసుడు దమస్కువాడైన ఎలీయెజెరే కదా” అని అన్నాడు.
3 ఇంకా అబ్రాము దేవునితో, “మీరు నాకు సంతానం ఇవ్వలేదు, కాబట్టి నా ఇంటి పనివారిలో ఒకడు నా వారసుడవుతాడు” అని అన్నాడు.
4 అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.”
5 దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.
6 అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు.
7 అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు.
8 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు.
9 అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.
10 అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు.
11 ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు.
12 సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది.
13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.
14 అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు.
15 నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.
16 నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”
17 సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి.
18 ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే,
19 కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు,
20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు,
21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు.