15
యూదా రాజైన అజర్యా
1 ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలన యొక్క ఇరవై ఏడవ సంవత్సరంలో, యూదారాజు అమజ్యా కుమారుడైన అజర్యా పరిపాలన ఆరంభించాడు.
2 అతడు రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా; ఆమె యెరూషలేముకు చెందినది.
3 అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
4 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
5 యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
6 అజర్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
7 అజర్యా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన జెకర్యా
8 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలుకు సమరయలో రాజయ్యాడు, అతడు ఆరు నెలలు పరిపాలించాడు.
9 అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు.
11 జెకర్యా గురించిన ఇతర విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
12 కాబట్టి యెహోవా యెహుతో చెప్పిన ఈ మాట నెరవేర్చబడింది: “నీ సంతానం నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”
ఇశ్రాయేలు రాజైన షల్లూము
13 యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు.
14 అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
15 షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
16 ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.
ఇశ్రాయేలు రాజైన మెనహేము
17 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు.
18 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన ఏలుబడి అంతటిలో, ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
19 తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.
20 ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.
21 మెనహేము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
22 మెనహేము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతని తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహ్య
23 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరంలో, మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
24 పెకహ్యా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
25 అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
26 పెకహ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
ఇశ్రాయేలు రాజైన పెకహు
27 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభై రెండవ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు.
28 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
29 ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.
30 తర్వాత ఏలా కుమారుడైన హోషేయ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేశాడు. ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలన యొక్క ఇరవయ్యవ సంవత్సరంలో అతడు పెకహు మీద దాడి చేసి, అతన్ని చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.
31 పెకహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
యూదా రాజైన యోతాము
32 ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో, యూదారాజు, ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలించడం ఆరంభించాడు.
33 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష, ఆమె సాదోకు కుమార్తె.
34 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
35 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు.
36 యోతాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
37 (ఆ రోజుల్లో యెహోవా యూదా మీదికి అరాము రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును పంపించడం మొదలుపెట్టారు.)
38 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని దావీదు పట్టణంలో, తన తండ్రి పట్టణంలో, వారితో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.