8
సొలొమోను ఇతర కార్యకలాపాలు
1 సొలొమోను యెహోవా మందిరాన్ని, తన సొంత భవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,
2 హీరాము అతనికి ఇచ్చిన గ్రామాలను సొలొమోను మరలా కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను స్థిరపరిచాడు.
3 తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు.
4 అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు.
5 ఎగువ బేత్-హోరోనును, దిగువ బేత్-హోరోనును కోటగోడలతో, ద్వారాలతో, అడ్డగడియలతో కోటగోడలు గల పట్టణాలుగా కట్టించాడు.
6 అలాగే బయలతు, తన ధాన్యాగారాలను, తన రథాలకు, గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో, లెబానోనులో, తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
7 హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు.
8 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను ఈనాటికీ బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు.
9 అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని తన పని కోసం బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, అతని సేనాధిపతుల అధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులుగా ఉన్నారు.
10 అంతేకాక, వారిలో రెండువందల యాభైమంది సొలొమోను రాజు ప్రజల మీద నియమించిన ముఖ్య అధికారులు కూడా ఉన్నారు.
11 సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.
12 తర్వాత సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు.
13 మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు.
14 తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు.
15 వారు యాజకులకు లేవీయులకు సంబంధించిన విషయాల్లో, ఖజానాల విషయంతో సహా ఏ విషయంలోనూ రాజు ఆజ్ఞలను మీరలేదు.
16 యెహోవా మందిరం పునాది వేయబడ్డప్పటి నుండి మందిరం పని మొత్తం ముగిసేవరకు సొలొమోను పనినంతా చేయించాడు. యెహోవా మందిరం పూర్తి అయింది.
17 అప్పుడు సొలొమోను ఎదోము యొక్క సముద్రతీరాన ఉన్న ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు ప్రాంతానికి వెళ్లాడు.
18 హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.