5
దెబోరా గీతం 
  1 ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు,   
 2 ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు  
ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు.  
మేము యెహోవాను స్తుతిస్తాం!   
 3 రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!  
నేను యెహోవాకు కీర్తన పాడుతాను.  
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను.   
 4 యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు,  
ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు,  
భూమి కంపించింది. ఆకాశం వణికింది.  
మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.   
 5 యెహోవా సముఖంలో కొండలు కంపించాయి.  
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖంలో సీనాయి కొండ కూడా కంపించింది.   
 6 అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి.  
ప్రయాణికులు ఎవరూ నడవని పక్క త్రోవల్లోనే నడిచారు.   
 7 దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు.  
ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది!   
 8 ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు.  
యుద్ధం వాళ్ళ ముఖ ద్వారాల దగ్గరికి వచ్చింది.  
ఇశ్రాయేలీయుల్లో నలభై వేలమందిలో  
ఒక్కడికైనా ఒక డాలే గానీ ఒక ఈటె గానీ కనిపించలేదు.   
 9 ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు.  
వారిని బట్టి యెహోవాను స్తుతించండి!   
 10 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ,  
త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి!   
 11 పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే*విల్లుకాండ్రు చేసే పాటలు పాడేవాళ్ళ స్వరాలు వినండి.  
యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు.  
ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు.  
“యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు.   
 12 మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు!  
బారాకూ వెళ్ళు, అబీనోయము కుమారా, వెళ్ళు. నీ శత్రువులను బంధించు.   
 13 ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు  
తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు.  
యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు.   
 14 కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు.  
వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు.  
మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబూలూనీయుల నుంచి నాయకదండం మోసేవాళ్ళూ వచ్చారు.   
 15 ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు.  
ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు.  
రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.   
 16 గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు?  
రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.   
 17 గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు.  
దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు?  
ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు?   
 18 జెబూలూనీయులకు మరణభయం లేదు.  
వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు.  
నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు.   
 19 రాజులు వచ్చి యుద్ధం చేశారు.  
మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేశారు.   
 20 కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు.  
నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి.  
నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి.   
 21 కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు.  
నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో!   
 22 గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి.   
 23 యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’  
‘దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.  
బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.’   
 24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది.   
 25 అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది.  
సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది.  
ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది.   
 26 పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది.  
ఆమె అతని తల పగలగొట్టింది.  
ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది.   
 27 అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు.  
ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు.  
అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు.   
 28 సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది.  
అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది  
అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి?  
అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?   
 29 ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు.  
ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది.   
 30 ‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా?  
యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా?  
సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది.  
రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది.  
రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.’   
 31 యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి.  
ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.”  
ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.