31
తన ప్రాణాన్ని తీసుకున్న సౌలు
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు. చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను అబీనాదాబు మల్కీ-షూవలను చంపేశారు. సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.
సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు.
కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు. ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు. ఇలా సౌలు అతని ముగ్గురు కుమారులు అతని ఆయుధాలను మోసేవాడు అతని మనుష్యులందరు ఒకేసారి చనిపోయారు.
ఇశ్రాయేలు సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కుమారులను చూశారు. అతని తల నరికి అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాలున్న గుడిలో, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు. 10 వారు అతని ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో పెట్టి అతని శవాన్ని బేత్-షాను పట్టణపు గోడకు తగిలించారు.
11 అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు ప్రజలు విన్నప్పుడు, 12 వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు. 13 తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.