18
యేసు అప్పగించబడుట
యేసు ప్రార్థించిన తర్వాత తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోకి వెళ్లారు.
యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కాబట్టి ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. కాబట్టి యూదా తనతో సైనికుల గుంపును ముఖ్య యాజకులు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో తోటకు వచ్చాడు.
యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
“నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు.
“ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు.
ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
అందుకు, “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు.
అందుకు యేసు, “నేనే ఆయనను. ఒకవేళ మీరు నా కోసం వెదకుతున్నట్లయితే వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. “నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు”*యోహాను 6:39 అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది.
10 అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు.
11 అప్పుడు యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు.
12 అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. 13 వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు. 14 ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
మొదటిసారి పేతురు నిరాకరించుట
15 సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కాబట్టి, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. 16 కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచయం ఉన్న ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువచ్చాడు.
17 ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా?” అని పేతురును అడిగింది.
అందుకు అతడు, “కాదు” అన్నాడు.
18 అప్పుడు చలిగా ఉండడంతో సేవకులు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించుట
19 ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు.
20 అందుకు యేసు, “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను. ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరాల్లో దేవాలయాల్లోనే నేను బోధించాను. నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. 21 నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు.
22 యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు.
23 అందుకు యేసు, “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు. 24 అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.
రెండవసారి మూడవసారి పేతురు నిరాకరించుట
25 సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు వారు, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు.
అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు.
26 ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువైన ఒకడు, “నేను నిన్ను ఒలీవల తోటలో అతనితో చూడలేదా?” అని అడిగాడు. 27 పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
పిలాతు ఎదుటకు యేసు
28 అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు. 29 కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఇతని మీద ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు.
30 వారు, “ఇతడు నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు.
31 పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు. 32 యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
33 తర్వాత పిలాతు భవనం లోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34 యేసు, “అది నీ సొంత ఆలోచనా లేదా ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు.
35 పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేశావు?” అని అడిగాడు.
36 యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు.
37 అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు.
38 పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఇతన్ని నిందించడానికి తగిన నేరం ఏదీ నాకు కనిపించలేదు. 39 కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కోసం విడుదల చేసే ఆచారం ఉంది కాబట్టి, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు.
40 అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

*18:9 యోహాను 6:39