12
ప్రసవించిన తర్వాత జరగాల్సిన శుద్ధీకరణ
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతియై ఒక మగశిశువుకు జన్మనిస్తే నెలసరి సమయంలో ఉన్నట్లే ఆచారరీత్య ఆమె ఏడు రోజులు అపవిత్రురాలిగా ఉంటుంది. ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి. అప్పుడు స్త్రీ తన రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి ముప్పై మూడు రోజులు వేచి ఉండాలి. శుద్ధీకరణ రోజులు పూర్తయే వరకు ఆమె పవిత్రమైన దేన్ని తాకకూడదు, పరిశుద్ధాలయానికి వెళ్లకూడదు. ఒకవేళ ఆమె ఆడపిల్లకు జన్మనిస్తే, ఆమె రెండు వారాలు అపవిత్రురాలిగా ఉంటుంది. అప్పుడు ఆమె రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి అరవై ఆరు రోజులు వేచి ఉండాలి.
“ ‘కుమారుని కోసం గాని కుమార్తె కోసం గాని ఆమె శుద్ధీకరణ రోజులు ముగిసిన తర్వాత ఆమె దహనబలి కోసం ఒక సంవత్సరపు గొర్రెపిల్లను, పాపపరిహారబలి కోసం ఒక చిన్న గువ్వను గాని పావురాన్ని గాని సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి అతడు వాటిని యెహోవా ఎదుట అర్పించినప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి ఆచారరీత్య శుద్ధి అవుతుంది.
“ ‘మగశిశువుకు గాని ఆడపిల్లకు గాని జన్మనిచ్చే స్త్రీకి నియమాలు ఇవే. ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”