27
ఉరి వేసుకున్న యూదా 
  1 తెల్లవారుజామున ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి యేసును ఎలా చంపాలి అని ఆలోచన చేశారు.   2 కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.   
 3 అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు.   4 అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు.  
అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు.   
 5 అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు.   
 6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, “ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి,   7 వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు.   8 అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది.   9-10 ఈ విధంగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన: “వారు ముప్పై వెండి నాణేలు తీసుకున్నారు, అవి ఇశ్రాయేలీయులు ఆయనకు కట్టిన విలువ, ప్రభువు నన్ను ఆదేశించిన ప్రకారం, వారు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు,”*జెకర్యా 11:12; యిర్మీయా 19:1-13; 32:6-9 అనే ప్రవచనం నెరవేరింది.   
పిలాతు ముందు యేసు 
  11 తర్వాత యేసు పిలాతు అధిపతి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అధిపతి, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు.  
అందుకు యేసు, “అని నీవే అన్నావు కదా” అని జవాబిచ్చారు.   
 12 ముఖ్య యాజకులు యూదానాయకులును యేసు మీద నిందలు మోపినప్పుడు, ఆయన వాటికి జవాబివ్వలేదు.   13 అందుకు పిలాతు, “వారు నీకు వ్యతిరేకంగా తెస్తున్న సాక్ష్యాన్ని నీవు వినడం లేదా?” అని అడిగాడు.   14 కాని కనీసం ఒకదానికైనా యేసు జవాబివ్వలేదు, అధిపతికి చాలా ఆశ్చర్యం కలిగింది.   
 15 పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి.   16 ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు.   17 కాబట్టి జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు.   18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు.   
 19 పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది.   
 20 కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు.   
 21 అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు.  
వారు, “బరబ్బనే” అని కేకలు వేశారు.   
 22 అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.  
అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు.   
 23 “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు.  
అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.   
 24 పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసుకుని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కుని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు.   
 25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.   
 26 అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.   
యేసును అపహసించిన సైనికులు 
  27 అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు.   28 వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.   29 ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.   30 వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.   31 వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.   
సిలువ మ్రానుపై యేసు 
  32 వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు.   33 వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము.   34 అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు.   35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.   36 వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.   37 ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు:  
ఇతడు యేసు, యూదుల రాజు.   
 38 ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు.   39 ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ,   40 “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.   41 అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు,   42 “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము.   43 వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.   44 ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.   
యేసు మరణం 
  45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.   46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?”†కీర్తన 22:1 అని అర్థము.   
 47 అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.   
 48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు.   49 మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.   
 50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.   
 51 ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.   52 సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి.   53 యేసు లేచిన తర్వాత వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలామందికి కనిపించారు.   
 54 శతాధిపతి అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.   
 55 అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు.   56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు యోసేపుల తల్లియైన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.   
యేసు యొక్క భూస్థాపన 
  57 సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు.   58 అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు, అందుకు పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆదేశించాడు.   59 యోసేపు ఆ దేహాన్ని తీసుకుని, శుభ్రమైన నారబట్టతో చుట్టి,   60 తన కోసం రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు.   61 మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే ఆ సమాధి ఎదుట కూర్చుని ఉన్నారు.   
యేసు సమాధికి కాపలా 
  62 మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు.   63 వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది.   64 కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయడానికి ఆదేశించండి. లేకపోతే, అతని శిష్యులు వచ్చి వాని శరీరాన్ని ఎత్తుకుపోయి, అతడు మృతులలో నుండి లేచాడని ప్రజలతో చెప్పవచ్చు. అప్పుడు మొదటి మోసం కంటే కడపటి మోసం మరి విపరీతంగా ఉంటుంది” అని చెప్పారు.   
 65 అందుకు పిలాతు, “కావలివారిని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు.   66 కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.