కీర్తన 53
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన.
“దేవుడు లేడు” అని
బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు.
వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి;
మంచి చేసేవారు ఒక్కరు లేరు.
 
అర్థం చేసుకునేవారు,
దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా
అని దేవుడు పరలోకం నుండి
మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు
ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు;
మంచి చేసేవారు ఎవరూ లేరు
ఒక్కరు కూడా లేరు.
 
కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?
 
వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;
వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.
అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర,
వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు.
మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు;
దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.
 
సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది!
దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,
యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!