కీర్తన 53
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. 
  1 “దేవుడు లేడు” అని  
బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు.  
వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి;  
మంచి చేసేవారు ఒక్కరు లేరు.   
 2 అర్థం చేసుకునేవారు,  
దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా  
అని దేవుడు పరలోకం నుండి  
మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు   
 3 ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు;  
మంచి చేసేవారు ఎవరూ లేరు  
ఒక్కరు కూడా లేరు.   
 4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?  
వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;  
వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.   
 5 అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర,  
వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు.  
మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు;  
దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.   
 6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది!  
దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,  
యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!