కీర్తన 114
ఇశ్రాయేలు ఈజిప్టు నుండి,
యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,
యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది,
ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.
 
అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది,
యొర్దాను వెనుకకు తిరిగింది;
పర్వతాలు పొట్టేళ్లలా,
కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి.
 
సముద్రమా, నీవెందుకు పారిపోయావు?
యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు?
పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా,
కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు?
 
ఓ భూమి, ప్రభువు సన్నిధిలో
యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.
ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు,
చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.