15
ఏడుగురు దేవదూతలు, ఏడు తెగుళ్ళు 
  1 నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది.   2 నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు.   3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ,  
“మా ప్రభువైన సర్వశక్తిగల దేవా!  
నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి!  
సకల రాజ్యాలకు*కొ.ప్ర.లలో యుగములకు రాజా!  
నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!   
 4 ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు,  
కాబట్టి నీకు భయపడని వారు ఎవరు?  
నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు?  
నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి,  
కాబట్టి భూజనులందరు  
నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,”†కీర్తన 111:2,3; ద్వితీ 32:4; యిర్మీయా 10:7; కీర్తన 86:9; కీర్తన 98:2 అని దేవుని స్తుతించారు.   
 5 దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది.   6 ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు.   7 అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు.   8 అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.