9
ఇశ్రాయేలీయుల కోసం పౌలు ఆవేదన
1 నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. 2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. 3 నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. 4 వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. 5 పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్.
దేవుని సార్వభౌమ ఎంపిక
6 దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. 7 అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”*ఆది 21:12 8 మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. 9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు”†ఆది 18:10,14 అని వాగ్దానం ఇవ్వబడింది.
10 అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో, 11 కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా, 12 పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు”‡ఆది 25:23 అని ఆమెతో చెప్పబడింది. 13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను”§మలాకీ 1:2,3 అని వ్రాయబడి ఉన్నది.
14 అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! 15 ఎందుకంటే ఆయన మోషేతో,
“నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను,
నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను”*నిర్గమ 33:19 అని చెప్పారు.
16 కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది. 17 అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”†నిర్గమ 9:16 18 కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు.
19 మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు, 20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”‡యెషయా 29:16; 45:9 21 ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?
22 దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? 23 మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, 24 అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? 25 హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం,
“నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను;
నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”§హోషేయ 2:23
26 ఇంకా,
“ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో,
అదే స్థలంలో వారు
‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”*హోషేయ 1:10
27 ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు:
“ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,
వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు.
28 ప్రభువు తాను చెప్పిన మాటను
భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.”†యెషయా 10:22,23
29 యెషయా గతంలో చెప్పినట్లుగా,
“సైన్యాల ప్రభువు
మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే
మనం సొదొమలా మారేవారం,
గొమొర్రాను పోలి ఉండేవారము.”‡యెషయా 1:9
ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం
30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు. 31 కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 32 వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు. 33 దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది:
“ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని,
వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను,
ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”§యెషయా 8:14; 28:16