19
హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట
హిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను.
హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు. వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు. అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.”
హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు. “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.
అష్షూరు రాజు మరల హిజ్కియాని హెచ్చరించుట
అష్షూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్లు ఆ సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు లిబ్నాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు. అష్షూరు రాజు కూషు రాజైన తిర్హకా గురించి ఒక వదంతి విన్నాడు. “తిర్హకా నీతో యుద్ధము చేయడానికి వచ్చాడు” అన్నదే ఆ వదంతి.
అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు. 10 “యూదా రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి.
 
‘నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా చేయకు.అష్షూరు రాజు యెరూషలేముని ఓడించిలేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా. 11 అష్షూరు రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం చేశాము. నీవు కాపాడుదువా? లేదు. 12 ఆ దేశాల దేవుళ్లు ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజెపులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు. 13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము రాజు? హేనా, ఇవ్వా రాజులు? అందురూ ముగింపబడ్డారు.’ ”
హిజ్కియా యెహోవాని ప్రార్థించుట
14 హిజ్కియా దూతలనుండి వచ్చిన ఉత్తరాలు చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు వుంచాడు. 15 హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, కెరూబుల నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు పరలోకము, భూమిని కల్పించావు. 16 ప్రభువా, నా మొర విను, ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు చూడు. సన్హరీబు సజీవుడైన దేవుని అవమానస్తూ చెప్పిన మాటలు విను. 17 అది నిజము, ప్రభూ. ఆ దేశాలను అష్షూరు రాజులు నాశనం చేశారు. 18 ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. 19 కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటారు.”
20 ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను.
21 “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది:
 
‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది.
ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది.
యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది.
22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు?
నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు?
నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు
నీవు అతని కంటె మంచివాడివిగా ప్రవర్తించావు.
23 నీ దూతల ద్వారా యెహోవాను అవ మానించి నీవు ఇలా చెప్పావు:
“ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను
నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను.
పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.
24 నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను
మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.”
25 ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా?
నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను
ప్రాచీన కాలం నుండి పథకం వేశాను
ఇప్పుడది జరుగునట్లు చేశాను
బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును
రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
26 నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు
భీతావహులు గందరగోళంలో ఉన్నావారు
క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు.
వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల
కప్పుల మీద పెరిగే పచ్చికవారు.
27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును.
నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు
నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు
నా పట్ల విసుగు చెందినది తెలుసును.
28 అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి
నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను
అందువల్ల నీ ముక్కకు గాలం వేస్తున్నాను
నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ
తర్వాత నిన్ను వెనుకకు మరల్చి
నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’ ”
హిజ్కియాకు యెహోవా సందేశము
29 తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయునున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజినుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. 30 తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు. 31 కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది.
32 “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా ఇది చెప్తాడు:
 
‘అతడీ నగరంలోకి రాడు.
అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు.
అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు.
నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
33 అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు.
అతడీ నగరంలోకి రాలేడు
అని యెహోవా చెప్పుచున్నాడు!
34 నేనీ నగరాన్ని రక్షిస్తాను.
నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’ ”
అష్షూరు సైన్యం నాశనం చేయబడుట
35 రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 185,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు.
36 అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు. 37 ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు ఆలయంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు కత్తితో అతనిని చంపారు. అప్పుడు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. మరియు సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.