20
మాసిదోనియ, గ్రీసుల గుండా పౌలు యెరూషలేము ప్రయాణం
ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియ బయలుదేరాడు.
ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసులను ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు. అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గానీ అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, తెస్సలోనిక వారు అరిస్తార్కు, సెకుందు, దెర్బె ఊరివాడు గాయి, తిమోతి, ఆసియా దేశాలకు చెందిన తుకికు, త్రోఫిము, అతనితో వచ్చారు. అయితే వారంతా ముందుగా వెళ్ళి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు.
త్రోయలో పౌలు చర్యలు
మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి ఐదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకుని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం.
ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు. మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి. పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
10 అప్పుడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడుకుని కౌగలించుకుని, “మీరిక గాభరా పడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు బతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు. 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకూ వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు. 12 సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
మిలేతుకు
13 మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకూ కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు. 14 అస్సులో అతడు మాతో కలిసిన తరువాత మేమంతా కలిసి మితిలేనే వచ్చాం.
15 అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకుని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం. 16 సాధ్యమైతే పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియలో కాలయాపన చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
ఎఫెసు సంఘపెద్దలతో పౌలు
17 అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు. 18 వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు.
19 యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు. 20 మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను. 21 అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.
22 “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు. 23 కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు.
24 అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు. 25 ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు. 26 కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను. 27 ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.
28 “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.
30 అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. 31 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.
32 ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. 33 నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. 34 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.
35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”
36 అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. 37 అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. 38 మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.