47
ఫిలిప్తీయుల గురించిన సందేశం 
  1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.   
 2 యెహోవా ఇలా చెపుతున్నాడు,  
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.  
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.  
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.  
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.   
 3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.  
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.  
తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు.  
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.   
 4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా  
త్వరలో నాశనం చేస్తాడు!  
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన  
వారందరినీ నాశనం చేస్తాడు.  
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.  
క్రేతు*క్రేతు “కఫోరు” ద్వీపమని దీని శబ్దార్థం. దీన్ని కొన్ని సార్లు క్రేతు అని, మరికొన్ని సార్లు కుప్ర అని అనటం కద్దు. బైబిలు ప్రకారం ఫిలిష్తీయులు ప్రథమంగా కఫ్తోరునుండి వచ్చారు. ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.   
 5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.  
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.  
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?†ఎంతకాలం … గాయపర్చుకుంటారు తమ విచారాన్ని సూచించేందుకు ప్రజలు తమ శరీరాలను చీరుకొని గాయపర్చుకునేవారు.   
 6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.  
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!  
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.   
 7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది?  
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.  
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని  
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”