ఎజ్రా
గ్రంథం
1
బందీలు తిరిగి వెళ్లడానికి కోరెషు సహాయం చేయుట
పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:
“పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే:
“ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక. మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”
అప్పుడు యూదా, బెన్యామీనీయుల కుటుంబ పెద్దలు, యాజకులు, లేవీయులు, దేవునిచే ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేందుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. వారి పొరుగువారందరు తమ స్వేచ్ఛార్పణలతో పాటు వెండి, బంగారం, సామాగ్రి, పశువులు, విలువైన కానుకలు ఇచ్చి వారికి సహాయం చేశారు.
అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని*లేదా దేవుళ్ళు గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు. పర్షియా రాజైన కోరెషు తన కోశాధికారియైన మిత్రిదాతుతో వాటిని తెప్పించి, అతడు వాటిని లెక్కించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.
 
ఆ జాబితాలో ఉన్న వస్తువులు:
 
బంగారు పాత్రలు 30;
వెండి పాత్రలు 1,000;
వెండి కడాయిలు 29;
10 బంగారు గిన్నెలు 30;
వెండి గిన్నెలు 410;
ఇతర వస్తువులు 1,000.
 
11 వెండి బంగారు వస్తువులు అన్ని కలిపి మొత్తం 5,400.
 
షేష్బజ్జరు వీటన్నిటితో పాటు బబులోనులో బందీలుగా ఉండి విడిపించబడిన వారందరిని తీసుకుని యెరూషలేముకు వెళ్లాడు.

*1:7 లేదా దేవుళ్ళు