34
కానాను సరిహద్దులు 
  1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,   2 “నీవు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ వారికి ఇలా చెప్పు: ‘మీరు కనానులో ప్రవేశించిన తర్వాత, మీకు వారసత్వంగా కేటాయించబడే భూములకు చెందిన సరిహద్దులు:   
 3 “ ‘మీ దక్షిణం వైపు ఎదోము సరిహద్దు ప్రక్కన సీను ఎడారిలో కొద్ది భాగం ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు మృత సముద్రం*అంటే ఉప్పు సముద్రం యొక్క దక్షిణ చివర తూర్పు దిక్కున ప్రారంభమై,   4 దక్షిణం వైపు అక్రబ్బీం కనుమ నుండి తిరిగి సీను వరకు వ్యాపించి కాదేషు బర్నియాకు దక్షిణంగా ఉంటుంది. అక్కడినుండి హజర్ అద్దారుకు, అక్కడినుండి అజ్మోను వరకు,   5 అజ్మోను నుండి తిరిగి ఈజిప్టు వాగు వైపు తిరిగి మధ్యధరా సముద్రం దగ్గర ముగుస్తుంది.   
 6 మీ పడమటి సరిహద్దు మధ్యధరా సముద్ర తీరము. ఇదే మీ పడమటి వైపు సరిహద్దుగా ఉంటుంది.   
 7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి హోరు పర్వతం వరకు   8 హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ,   9 అక్కడినుండి జిఫ్రోను వరకు కొనసాగుతూ హజర్-ఎనాను వరకు వ్యాపిస్తుంది. ఇది మీకు ఉత్తర సరిహద్దుగా ఉంటుంది.   
 10 మీ తూర్పు సరిహద్దు హజర్-ఎనాను నుండి షెఫాము వరకు ఉంటుంది.   11 సరిహద్దు షెఫాము నుండి ఆయినుకు తూర్పు వైపు రిబ్లా వరకు వెళ్లి కిన్నెరెతు సరస్సు†అంటే గలలీ సరస్సు తూర్పున ఉన్న వాలుల వెంట కొనసాగుతుంది.   12 తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.   
“ ‘ఇది మీ దేశం, దీనికి అన్ని వైపుల సరిహద్దులు ఉంటాయి.’ ”  
 13 మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చీట్లు వేసి ఈ దేశాన్ని ఒక వారసత్వంగా కేటాయించాలి. తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని యెహోవా ఆదేశించారు,   14 ఎందుకంటే రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే అర్థగోత్రం, తమ తమ కుటుంబాలు వారసత్వం పొందారు.   15 ఈ రెండున్నర గోత్రాల వారు యెరికోకు తూర్పున యొర్దానుకు అవతలి వైపు, సూర్యోదయం వైపున ఉన్న భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు.”   
 16 యెహోవా మోషేతో అన్నారు,   17 “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ.   18 భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు.   
 19 “వారి పేర్లు ఇవి:  
“యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;   
 20 షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;   
 21 బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు;   
 22 దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు;   
 23 యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;   
 24 ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు;   
 25 జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు;   
 26 ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు;   
 27 ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు;   
 28 నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.”   
 29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.